
బంగ్లాదేశ్తో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్లో భారత జట్టు ఓటమిపాలైంది. బ్యాటర్లు ఘోరంగా విఫలమైనా.. బౌలర్లు ఈ మ్యాచ్లో భారత్ను దాదాపు గెలిచినంత పని చేశారు. కానీ చివరి వికెట్ తీసుకోలేక పోవడంతో భారత్ ఓడిపోయింది. దీంతో కొందరు ఫ్యాన్స్ భారత బౌలింగ్ విభాగాన్ని తిట్టిపోస్తున్నారు. వాళ్లు సరిగా బౌలింగ్ చేసి ఉంటే భారత్ గెలి ఉండేదని అంటున్నారు.
షేర్ ఎ బంగ్లా స్టేడియంలో జరిగిన వన్డే మ్యాచ్లో భారత బ్యాటర్లందరూ మూకుమ్మడిగా విఫలమయ్యారు. కేఎల్ రాహుల్ (73) ఒక్కడే హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో భారత జట్టు 186 పరుగులకే ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనలో బంగ్లాకు ఆరంభంలోనే భారత బౌలర్లు షాకిచ్చారు. ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెనర్ షాంటోను దీపక్ చాహర్ పెవిలియన్ చేర్చాడు. ఇలా భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ బంగ్లా బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు.

టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ మూడు వికెట్లు తీసుకోగా.. ఈ మ్యాచ్లో అరంగేట్రం చేసిన కుల్దీప్ సేన్ కూడా రెండు వికెట్లు కూల్చాడు. వాషింగ్టన్ సుందర్ కూడా రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. చాహర్, శార్దూల్ ఠాకూర్ చెరో వికెట్ తీసుకున్నారు. దీంతో బంగ్లా జట్టు 136 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయింది. ఇలాంటి సమయంలో మెహదీ హసన్ ఇచ్చిన సులభమైన క్యాచ్ను కేఎల్ రాహుల్ వదిలేశాడు. వాషింగ్టన్ సుందర్ కూడా ఒక క్యాచ్ మిస్ చేశాడు. ఇలా భారత ఆటగాళ్ల వరుస తప్పిదాల వల్ల బంగ్లా విజయం సాధించింది.
ఈ క్రమంలోనే భారత బౌలింగ్ను కొందరు అభిమానులు తప్పుబడుతున్నారు. చివరి వికెట్కు బంగ్లాదేశ్ 51 పరుగులు జోడించిందని, ఈ క్రమంలో ఒక్క బౌలర్ కూడా యార్కర్లు వేసే ప్రయత్నం చేయలేదని విమర్శిస్తున్నారు. అలాగే జట్టులో నిఖార్సయిన పేస్ బౌలర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. ఉమ్రాన్ మాలిక్ వంటి ఆటగాడిని పక్కన పెట్టకుండా ఆడించి ఉంటే టెయిలెండర్లను త్వరగా అవుట్ చేయొచ్చని చెప్తున్నారు.