హైదరాబాద్: బర్మింగ్ హామ్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ ఆగస్టు 1 నుంచి జరగనుంది. అయితే, ఈ తొలి టెస్టు మ్యాచ్కు సిద్దం చేసిన పిచ్ను గ్రౌండ్స్మెన్ కూడా అంచనా వేయలేరని ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్లో ఉన్న వాతావరణాన్ని బట్టి చూస్తే తొలి టెస్టుకు పిచ్ ఎవరికి సహకరిస్తుందో చెప్పడం కష్టమని అన్నాడు.
తాజాగా, క్రిక్ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టువర్ట్ బ్రాడ్ మాట్లాడుతూ "ఇరు జట్లకూ ఈ సిరీస్ ఎంతో అద్భుతంగా నిలవనుంది. కానీ ఇంగ్లండ్లో ప్రస్తుత వాతావరణాన్ని బట్టి చూస్తే మైదానం సిబ్బంది కూడా పిచ్ ఎలా సహకరిస్తుందో చెప్పలేరు. ఆటగాళ్లే పరిస్థితులకు అనుగుణంగా ప్రదర్శన చేయాల్సి ఉంటుంది" అని చెప్పుకొచ్చాడు.
"ట్రెంట్ బ్రిడ్జి నుంచి లార్డ్స్ వరకు ప్రతి మైదానం ప్రత్యేకమే. అలాంటి సమయాల్లో బౌలర్లు అక్కడి పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటేనే విజయం వరిస్తోంది. ఇక సిరీస్ ఎవరిని వరిస్తుందో చెప్పడం చాలా కష్టం. ఒకవేళ పిచ్లు స్పిన్నర్లకు అనుకూలిస్తే కచ్చితంగా వారిపై పనిభారం పడుతుంది" అని బ్రాడ్ పేర్కొన్నాడు.
"అలా అని ఫాస్ట్ బౌలర్లకు ఎక్కువ ఓవర్లు వేసే అవకాశం ఉండదనుకోలేం. ఇక, నా విషయానికొస్తే పూర్తి స్థాయిలో టెస్టు సిరీస్ను ఆస్వాదించాలనుకుంటున్నాను" అని స్టువర్ట్ బ్రాడ్ తెలిపాడు. "ప్రస్తుతానికి భారత్ సమతూకంగా కనిపిస్తోంది. ఎలాంటి పరిస్థితులనైనా అనుకూలంగా మార్చుకొని సత్తా చాట గల నాణ్యమైన ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు" అని అన్నాడు.
"దీంతో ఇరు జట్ల మధ్య పోరు కఠినంగానే కొనసాగనుంది. ఏ జట్టు అయితే పరిస్థితులను అనుకూలంగా మార్చుకొని అత్యుత్తమ ఆటను ఆడుతుందో అదే చివరికి విజయం సాధిస్తుంది" అని బ్రాడ్ తెలిపాడు.