
భారత స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ (37) అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. బీసీసీఐతో చర్చలు జరిపిన అనంతరం సోమవారం ముంబయిలో మీడియా సమావేశం నిర్వహించి యువరాజ్ సింగ్ ఈ విషయాన్ని ప్రకటించారు. 'వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయం అనిపించింది. దాదాపు 17 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా. జీవితంలో ఏ విధంగా పోరాడాలో ఆటనే నేర్పింది' అని యువీ పేర్కొన్నాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
యువీ రిటైర్మెంట్ సందర్భంగా తన తోటి ఆటగాళ్ల నుంచి ట్విట్టర్లో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అందరూ యువీకి ఘనంగా వీడ్కోలు పలుకుతున్నారు. ఈ క్రమంలో ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ యువీ రిటైర్మెంట్పై స్పందించాడు. 'ఓ దిగ్గజం.. నీ రిటైర్మెంట్ను ఆస్వాదించు' అని ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చారు.
2007 తొలి టీ20 ప్రపంచకప్లో యువరాజ్ ఆరు సిక్సులు బాదిన విషయం తెలిసిందే. యువీ ఊతకోచకు బలైంది మరెవరో కాదు స్టువర్ట్ బ్రాడ్. బ్రాడ్ వేసిన ఓవర్లో 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదిన యువీ చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. ఆ మ్యాచులో యువీ కేవలం 12 బంతుల్లోనే ఫాస్టెస్ట్ అర్ధ సెంచరీ చేసాడు. ఆ రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది.
యువరాజ్ సింగ్ మాజీ స్నేహితురాలు కిమ్ శర్మ కూడా ట్విటర్లో వీడ్కోలు సందేశం తెలిపింది. 'యువరాజ్ ఇంతకాలం బాగా ఆడావు. క్రికెట్లో నీ మధుర జ్ఞాపకాలకు చాలా ఉన్నాయి. హాజెల్ కీచ్తో నీ జీవితం బాగుండాలని కోరుకుంటున్నా' అని ట్వీటింది.