బ్రిస్టల్: ఏడేళ్ల విరామం తర్వాత భారత మహిళల క్రికెట్ జట్టు టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. కొదిసేపటి క్రితం ప్రారంభం అయిన మ్యాచ్లో ఇంగ్లండ్తో మిథాలీసేన తలపడుతోంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ హీథర్ నైట్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో మిథాలీ సేన ముందుగా బౌలింగ్ చేస్తోంది. పవర్హిట్టర్ షెఫాలీ వర్మ ఈ మ్యాచ్తో టెస్ట్ అరంగేట్రం చేస్తోంది. అయితే ఆమెను ఏస్థానంలో ఆడించాలో ఇంకా నిర్ణయించలేదని కెప్టెన్ మిథాలీ రాజ్ చెప్పింది. ఇంగ్లండ్ తరఫున సోఫియా డంక్లే కూడా టెస్ట్ అరంగేట్రం చేసింది.
టాస్ గెలిస్తే తాము కూడా మొదట బ్యాటింగ్ చేసేవాళ్లమని టీమిండియా సారథి మిథాలీ రాజ్ చెప్పింది. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగింది. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ టెస్ట్ ఆడుతుండటం తమకు ఓ సవాలే అని, టీమ్లోని సీనియర్లు యువ ప్లేయర్స్ను గైడ్ చేస్తున్నట్లు మిథాలీ తెలిపింది. ఇంగ్లండ్ టూర్లో భాగంగా ఈ ఏకైక టెస్ట్తో పాటు మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్లలో భారత మహిళల క్రికెట్ జట్టు ఇంగ్లీష్ మహిళలతో తలపడనున్నారు.
గత మూడు టెస్టుల్లో భారత్ హ్యాట్రిక్ విజయాలు సాధించింది. 2014లో ఇంగ్లండ్తో రెండు, దక్షిణాఫ్రికాపై ఓ మ్యాచ్లో గెలిచింది. ఇక ఈ మ్యాచ్లో గెలిస్తే వరుసగా అత్యధిక టెస్టు విజయాలు సాధించిన మహిళల జట్టుగా రికార్డు సొంతం చేసుకుంటుంది. ఇంగ్లండ్ గడ్డపై 8 టెస్టులు ఆడిన భారత్ రెండింట గెలిచింది. ఆరు మ్యాచ్లను డ్రా చేసుకొని అజేయ రికార్డుతో ఉంది. కాగా ఇంగ్లిష్ జట్టుతో మొత్తంగా 13 టెస్టుల్లో తలపడిన భారత్ రెండింట గెలిచి.. ఓ మ్యాచ్లో పరాజయం పాలైంది. 10 డ్రాగా ముగిశాయి.
తుది జట్లు:
భారత్: స్మృతి మంధనా, షఫాలి వర్మ, పూనమ్ రౌత్, మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, స్నేహ రానా, తానియా భాటియా (కీపర్), జులన్ గోస్వామి, పూజా వస్త్రకర్, శిఖా పాండే.
ఇంగ్లండ్: లారెన్ విన్ఫీల్డ్ హిల్, టామీ బ్యూమాంట్, హీథర్ నైట్ (కెప్టెన్), నటాలీ స్కివర్, అమీ ఎల్లెన్ జోన్స్ (కీపర్), సోఫియా డంక్లే, జార్జియా ఎల్విస్, కేథరీన్ బ్రంట్, అన్య ష్రబ్సోల్, సోఫీ ఎక్లెస్టోన్, కేట్ క్రాస్.