మాంచెస్టర్: ఇంగ్లండ్ స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్ తన రిటైర్మెంట్ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. ఇప్పట్లో రిటైర్మెంట్ ఆలోచనే లేదని, ఇంకొన్నాళ్లు కొనసాగుతా అని స్పష్టం చేశాడు. 2021-22 యాషెస్ సిరీస్ ఆడుతానని చెప్పకనే చెప్పాడు. తన బౌలింగ్ లయ తప్పిన మాట వాస్తవమేనని, అయితే పాకిస్తాన్తో జరిగిన రెండో టెస్టులో బాగా ఆడేందుకు కృషి చేస్తానని జిమ్మీ అన్నాడు. అంతర్జాతీయ కెరీర్లో అండర్సన్ ఇప్పటివరకు 154 టెస్టుల్లో, 194 వన్డేల్లో, 19 టీ20 మ్యాచ్ల్లో ఇంగ్లీష్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
స్కై స్పోర్ట్స్ పోస్ట్ చేసిన వీడియోలో జేమ్స్ అండర్సన్ మాట్లాడుతూ... 'ఇప్పుడప్పుడే నేను ఆటకు గుడ్ బై చెప్పను. ఇంకొన్నాళ్లు కొనసాగుతా. వ్యక్తిగతంగా నాకు నిరాశ కలిగించే వారం ఇది. ఎందుకంటే నేను బాగా బౌలింగ్ చేయలేదు. బౌలింగ్ లయ తప్పిన మాట వాస్తవమే. బహుశా పదేళ్లలో మొదటిసారి. మైదానంలో కొంచెం ఎమోషనల్ అయి ఉండవచ్చు. అయితే రెండో టెస్టులో బాగా ఆడేందుకు కృషి చేస్తా. బౌలింగ్ను గాడిలో పెట్టేందుకు మరింత పట్టుదలతో ప్రాక్టీస్ చేస్తా' అని అన్నారు.
'సౌతాంప్టన్లో వచ్చే రెండు రోజులు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఏవైన సాంకేతిక సమస్యలు ఉంటే సరిదిద్దుకోవాలి. తద్వారా టెస్ట్ క్రికెట్ ఆడటానికి నాకు ఇంకా ఏమి అవసరమో ప్రయత్నించి అభిమానులకు మరో మంచి ప్రదర్శన ఇవ్వాలి. ఈ వారం చేసిన విధంగానే బౌలింగ్ చేస్తే.. రిటైర్మెంట్ నా చేతుల్లో ఉండదు. అప్పడు జట్టులోకి ఎంపిక సమస్య అవుతుంది. నేను ఇంకా ఆకలితో ఉన్నాను' అని 38 ఏళ్ల జేమ్స్ అండర్సన్ తెలిపాడు.
ఇంగ్లండ్ టెస్టు జట్టు ప్రధాన బౌలర్ అయిన జేమ్స్ అండర్సన్.. ఇప్పటి వరకు 154 టెస్టులు ఆడాడు. 2.86 ఎకానమీ, 56.5 స్ట్రైక్ రేట్తో 590 వికెట్లు పడగొట్టాడు. 194 వన్డేల్లో 269 వికెట్లు తీసుకున్నాడు. ఇక 19 టీ20లో 18 వికెట్లు కూల్చాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 150వ టెస్ట్ మ్యాచ్ ఆడిన తొలి బౌలర్గా అండర్సన్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఇప్పటివరకు ఏ బౌలర్ కూడా 150 టెస్ట్ మ్యాచ్లు ఆడలేదు. షేన్ వార్న్ (145), ముత్తయ్య మురళీధరన్ (133), అనిల్ కుంబ్లే (132), గ్లెన్ మెక్గ్రాత్ (124) లాంటి దిగ్గజాలకు సాధ్యం కాని రికార్డును 38 ఏళ్ల జేమ్స్ అండర్సన్ అందుకున్నాడు. ఒక పేస్ బౌలర్ 150 టెస్ట్ మ్యాచ్లు ఆడడం విశేషం.
IPL 2020: ఐపీఎల్ నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!!