హైదరాబాద్: గురువారం నుంచి ఇంగ్లాండ్తో ఆరంభమయ్యే మూడు వన్డేల సిరిస్లో టీమిండియా బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉండాలంటే, కెప్టెన్ విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో బరిలోకి దిగాలని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య గురువారం నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.
గతేడాది జూలై- ఆగస్టుల్లో శ్రీలంక పర్యటన మొదలైనప్పటి నుంచి నాలుగో స్థానంలో సరైన బ్యాట్స్మన్ కోసం టీమిండియా ప్రయోగాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ స్థానంలో ఇప్పటికే ఆరుగురు బ్యాట్స్మెన్లు కేఎల్ రాహుల్, కేదార్ జాదవ్, మనీష్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, రహానేలను పరీక్షించింది.
గంగూలీ కూడా ఇంగ్లాండ్ పర్యటనలోనే ఉన్నాడు. ఇరు జట్ల మధ్య జరుగుతోన్న వన్డే సిరీస్కు గంగూలీ కామెంటేటర్గా బాధ్యతలు నిర్వహించనున్నాడు. ఎంతో కీలకమైన నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీ ఆడటమే సరైన వ్యూహమని గంగూలీ పేర్కొన్నాడు. అంతేకాదు ఇంగ్లాండ్తో జరిగిన మూడు టీ20ల సిరీస్ను 2-1తో కైవసం చేసుకోవడానికి కోహ్లీ నాలుగో స్థానంలో బరిలోకి దిగడమే కారణమని గంగూలీ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.
"ఇటీవల ముగిసిన టీ20 సిరీస్ బ్యాటింగ్ లైనప్ చూడండి. ఎంత చక్కగా, పటిష్టంగా ఉందో. రాహుల్ మూడో స్థానంలో, కోహ్లీ నాలుగో స్థానంలో చక్కగా రాణించారు. బ్యాట్స్మన్ లైనప్లో ఎలాంటి సమస్యలు కూడా తలెత్తలేదు. అందుకే, వన్డేలకు సైతం అదే వ్యూహాన్ని అనుసరిస్తే మంచి ఫలితం వస్తుందని బలంగా నమ్ముతున్నా" అని గంగూలీ అన్నాడు.
ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు కూడా బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగి ఉన్నప్పటికీ, బౌలింగ్ విభాగం వీక్గా ఉందని గంగూలీ పేర్కొన్నాడు. బ్రిస్టల్ వేదికగా జరిగిన ఆఖరి టీ20లో 200 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత బ్యాట్స్మెన్ చేధించిన వైనమే ఇందుకు నిదర్శమని గంగూలీ వెల్లడించాడు.
"ఇప్పుడు ఇంగ్లాండ్ పర్యటనకు వచ్చిన భారత జట్టు ఎంతో పటిష్టంగా ఉంది. తప్పకుండా వన్డేల్లో, టెస్టుల్లో కూడా విజయం సాధిస్తుంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత బ్యాట్స్మెన్లు మెరుగ్గా రాణిస్తున్నారు. శిఖర్ధావన్- రోహిత్ శర్మతో టాప్ ఆర్డర్ చాలా బలంగా ఉంది. వీరిద్దరూ ఇదే పరుగుల ప్రవాహం కొనసాగిస్తే నేను, సచిన్తో కలిసి నెలకొల్పిన రికార్డులకు చేరువవుతారు" అని గంగూలీ అన్నాడు.