
హైదరాబాద్: అసలే టీమిండియా సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో అందరూ ఆశలు నిలుపుకున్న కోహ్లీ.. రెండో టెస్టు మూడో రోజు ఆటలో లేకపోవడం జట్టును కుంగదీస్తోంది. వెన్నునొప్పి కారణంగా ఆదివారం మ్యాచ్కు కోహ్లీ దూరం కావడంతో ఆ బాధ్యతలను అజింకా రహానె నెత్తినేసుకున్నాడు. ఇలాంటి సమయంలో మనపై మనం నమ్మకం పెట్టుకోవాలి. నమ్మకమే ముఖ్యమైంది. ఈ టెస్టులో మేము విజయం సాధించి సిరీస్ను 1-1తో సమం చేస్తాం' అని అంటున్నాడు భారత వైస్ కెప్టెన్ రహానె.
సమం చేయొచ్చు.. చెప్పలేం:
ఆతిథ్య ఇంగ్లాండ్తో లార్డ్స్లో జరుగుతోన్న రెండో టెస్టులో భారత్ 107 పరుగులకే కుప్పకూలింది. వర్షం కారణంగా గురువారం తొలి రోజు ఆట పూర్తిగా రద్దయ్యింది. దీంతో ఇంకా మూడు రోజుల ఆట మాత్రమే మిగిలి ఉంది. 'ఈ టెస్టులో మేము ఆతిథ్య జట్టు ఆటగాళ్లను త్వరగా ఔట్ చేసి రెండో ఇన్నింగ్స్లో మంచిగా పరుగులు సాధిస్తే మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం ఖాయం. మమ్మల్ని మేము నమ్ముకోవడం ఇప్పుడు చాలా ముఖ్యం. మ్యాచ్లో ఇంకా 3 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కాబట్టి ఫలితం గురించి ఇప్పుడే చెప్పలేం. మ్యాచ్ ముగిసేలోపు 1-1తో సిరీస్ను సమం చేస్తామేమో' అని రహానె ఆశాభావం వ్యక్తం చేశాడు.
'ఇంగ్లాండ్ బౌలర్ అండర్సన్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. ఒక్క షార్ట్ బాల్ కూడా వేయలేదు. ఇలాంటి వికెట్పై బౌలింగ్ చేయడం చాలా కష్టం. కానీ అండర్సన్ మంచి లెంగ్త్తో, స్థిరంగా బౌలింగ్ వేశాడు. పరిస్థితులను బాగా అర్థం చేసుకుని బౌలింగ్ చేశారు' అని రహానె అన్నాడు.
'బంతులు ఎలా వస్తున్నాయో అర్థం చేసుకోవడానికి మొదట మూడు ఓవర్లలో పరుగులు చేయకపోయినా పర్వాలేదు. అవసరం అయితే మరో మూడు ఓవర్లు కూడా అలాగే ఆడాలి. ఇలాంటి సమయంలోనే మన ఓపిక, టెక్నిక్, సామర్థ్యం ఏమిటన్నది తెలుస్తోంది. పుజారా రనౌట్ చూసి జట్టు సభ్యుడిగా ఫీలయ్యాను. నేను మాత్రమే కాదు పుజారాతో పాటు జట్టు సభ్యులు కూడా ఫీలయ్యారనే అనుకుంటున్నా' అని రహానె తెలిపాడు.