జొహాన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టెస్టులో ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చిన ఇంగ్లండ్ 191 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా నాలుగు మ్యాచ్ల సిరీస్ను 3-1తో కైవసం చేసుకుంది. దీంతో సొంతగడ్డపై దక్షిణాఫ్రికా జట్టుకు మరో పరాభవం ఎదురైంది. తొలి టెస్టు నెగ్గి కోలుకున్నట్లు కనిపించిన దక్షిణాఫ్రికా.. ఆ తర్వాత పేలవ ప్రదర్శనతో వరుసగా మూడు టెస్టులు ఓడి సిరీస్ను చేజార్చుకుంది.
ఆస్ట్రేలియన్ ఓపెన్: పోరాడి గెలిచిన నాదల్.. మాజీ చాంపియన్ కెర్బర్కు షాక్!!
ఇంగ్లిష్ పేసర్ మార్క్ వుడ్ నాలుగు వికెట్లతో చెలరేగడంతో 466 పరుగుల లక్ష్య ఛేదనలో నాలుగో రోజు సోమవారం ఆటను ఆరంభించిన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 274 పరుగులకు ఆలౌటైంది. వాన్డర్ డసెన్ (98; 15 ఫోర్లు, 2 సిక్స్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ (39), కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (35) ఆదుకునే ప్రయత్నం చేశారు. ఓపెనర్లు మలన్ (22), ఎల్గర్ (24) త్వరగానే ఔట్ అవ్వడంతో డసెన్ పోరాడాడు. అయితే డికాక్, డుప్లెసిస్ భారీ ఇన్నింగ్స్ ఆడకపోవడంతో ప్రొటీస్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత మరే బ్యాట్స్మన్ క్రీజులో నిలవకపోవడంతో భారీ ఓటమిని చవిచూసింది.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 400 పరుగులు చేసింది. జాక్ క్రాలే (66), జో రూట్ (59), ఓలీ పోప్ (56) హాఫ్ సెంచరీలు చేసారు. అన్రిచ్ నొర్జే ఐదు వికెట్లు తీసాడు. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 183 పరుగులకు ఆలౌటైంది. డికాక్ (77) అర్ధ సెంచరీ చేసాడు. మార్క్ వుడ్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 248 స్కోరు చేసింది. రూట్ (58) హాఫ్ సెంచరీ చేసాడు. 4 వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీసిన వుడ్కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది. 318 పరుగులు చేయడంతో పాటు 10 వికెట్లు పడగొట్టిన బెన్ స్టోక్స్ 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్'గా నిలిచాడు.
2004-05 తర్వాత దక్షిణాఫ్రికా వరుసగా 3 టెస్టు సిరీస్లు కోల్పోవడం ఇదే మొదటిసారి. స్వదేశంలో శ్రీలంక చేతిలో 0-2తో పరాజయంపాలైన ప్రొటీస్.. ఇక భారత గడ్డపై కూడా 0-3తో చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్తో దక్షిణాఫ్రికా సీనియర్ పేసర్ వెర్నాన్ ఫిలాండర్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఫిలాండర్ 64 టెస్టుల్లో 224 వికెట్లు పడగొట్టాడు. సిరీస్లో ఘోరంగా విఫలమైన కెప్టెన్ డుప్లెసిస్కు సారథిగా, ఆటగాడిగా కూడా ఇదే చివరి టెస్టు కావచ్చని సమాచారం.