ఇంగ్లండ్ నెత్తిన తాజా పిడుగు: కీలక ఆటగాళ్లు టీమిండియాతో మ్యాచ్కు దూరం?

లండన్: ప్రపంచకప్ టోర్నమెంట్ ఆరంభానికి ముందు.. హాట్ ఫేవరెట్ల లిస్ట్లో టాప్ త్రీలో ఉన్న పేరు ఇంగ్లండ్ క్రికెట్ టీమ్. అదే రేంజ్లో టోర్నమెంట్ను కూడా ఆరంభించింది. మ్యాచ్లు కొనసాగుతున్న కొద్దీ బలహీనపడుతూ వచ్చింది ఈ జట్టు. పాకిస్తాన్, శ్రీలంక, ఆస్ట్రేలియాల చేతుల్లో ఓటమి పాలైంది. ఆడిన ఏడు మ్యాచుల్లో మూడింటిలో ఓడిపోయింది. మిగిలిన రెండింటినీ తప్పనిసరిగా గెలవాల్సిన స్థితిని ఎదుర్కొంటోంది. ఈ రెండింట్లో ఏ ఒక్కటి ఓడిపోయినప్పటికీ.. ఇంగ్లండ్ జట్టుకు సెమీ ఫైనల్ ద్వారాలు దాదాపు మూసుకునిపోయినట్టుగానే చెప్పుకోవచ్చు.

పిక్కలు పట్టేయడంతో..
ఆస్ట్రేలియాతో బ్యాటింగ్ చేస్తున్న సందర్భంగా బెన్స్టోక్స్ గాయపడినట్లు చెబుతున్నారు. పిక్కలు పట్టేయడం వల్ల జట్టు ఫిజియోథెరఫిస్ట్ పలుమార్లు మైదానంలోకి వచ్చి, అతణ్ని పరీక్షించి వెళ్లారు. మ్యాచ్ తరువాత కూడా అదే సమస్యతో బెన్స్టోక్స్ బాధపడుతున్నాడని టీమ్ మేనేజ్మెంట్ అనధికారికంగా చెబుతోంది. టీమిండియాతో మ్యాచ్ నాటికి పూర్తిగా తేరుకోవడానికి అవకాశం ఉందని తాము ఆశిస్తున్నామని అంటోంది మేనేజ్మెంట్. అటు శ్రీలంక, ఇటు ఆస్ట్రేలియాలతో జరిగిన మ్యాచ్లల్లో బెన్ స్టోక్స్ ఒక్కడే మిడిలార్డర్లో రాణించిన విషయం తెలిసిందే.

రషీద్, జోఫ్రా ఆర్చర్ భుజాల్లో సమస్యలు..
భుజాల్లో నొప్పి కారణంగా స్పిన్నర్ ఆదిల్ రషీద్, అదే సమస్యతో జోఫ్రా ఆర్చర్ ఇబ్బందులను పడుతున్నట్లు సమాచారం. వందశాతం ఫిట్నెస్తో లేనప్పటికీ.. ఆస్ట్రేలియాతో మ్యాచ్కు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని జోఫ్రా ఆర్చర్ను తుది జట్టులోకి తీసుకున్నారని చెబుతున్నారు. ఈ కారణంతోనే వారు బౌలింగ్ను కూడా సరిగ్గా వేయలేకపోయారని అంటున్నారు. ఆదిల్ రషీద్ తన పది ఓవర్ల కోటాలో 49 పరుగులు సమర్పించుకుని, ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోయాడని చెబుతున్నారు. అలాగే జోఫ్రా ఆర్చర్ సైతం తొమ్మిది ఓవర్లలను మాత్రమే వేసి 56 పరుగులు ఇచ్చి, ఒక వికెట్ను మాత్రమే తీసుకున్నాడు. మార్క్వుడ్, క్రిస్ వోక్స్ సైతం పెద్దగా ఫిట్నెస్తో లేరని చెబుతున్నారు.

రాయ్ దూరం..ప్రభావం చూపని విన్సీ..
ఇప్పటికే డాషింగ్ ఓపెనర్ జేసన్ రాయ్ జట్టుకు దూరం కావడం వల్ల ఓపెనింగ్ సమస్యలను ఎదుర్కొంటోంది ఇంగ్లండ్ జట్టు. రాయ్ స్థానంలో జట్టులోకి తీసుకుని, బెయిర్స్టోతో కలిసి ఇన్నింగ్ను ఆరంభిస్తోన్న జేమ్స్ విన్సీ పెద్దగా ప్రభావం చూపించట్లేదు. విన్సీతో పాటు హార్డ్ హిట్టర్గా పేరున్న బెయిర్స్టో సైతం తన స్థాయికి తగినట్టుగా ఆడట్లేదు. ఈ పరిస్థితుల్లో భారత్, న్యూజీలాండ్ వంటి రెండు బలమైన జట్లను ఢీ కొట్టి, సెమీ ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకోవడం అనేది ఇంగ్లండ్ జట్టుకు అసాధ్యం అనిపించేలా కనిపిస్తోంది.

బలమైన భారత్తో ఎలా సన్నద్ధమౌతుందో..
ఆదివారం బలమైన భారత క్రికెట్ జట్టును ఎదుర్కోవాల్సిన ఉన్న నేపథ్యంలో ఇంగ్లండ్ టీమ్ సరికొత్త సమస్య ఎదురపడింది. అదే- ఫిట్నెస్. ముగ్గురు కీలక ఆటగాళ్లు ఫిట్నెస్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆదివారం నాటికి ఆ ముగ్గురూ తేరుకోలేకపోతే.. ఇంగ్లండ్ కథ కంచికే చేరుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు. మిడిలార్డర్లో బ్యాటింగ్ వెన్నెముకగా మారిన బెన్స్టోక్స్, స్పిన్నర్ ఆదిల్ రషీద్, ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్. ఈ ముగ్గురు ఆటగాళ్లు వందశాతం ఫిట్నెస్తో లేరని తెలుస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications