
హైదరాబాద్: ఇంగ్లాండ్ స్పిన్నర్ సోఫియా ఎక్లీస్టోన్(4-37) దెబ్బకు రెండో వన్డేలో భారత మహిళల జట్టు ఓటమి పాలైంది. నాగ్పూర్ వేదికగా ఇంగ్లాండ్తో సోమవారం జరిగిన రెండో వన్డేలో మిథాలీ రాజ్ నేతృత్వంలోని భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.
దీంతో మూడు వన్డేల సిరిస్ 1-1తో సమం అయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి 37.2 ఓవర్లకే 113 పరుగులకే ఆలౌటైంది. భారత జట్టులో స్మితి మందాన (42 బంతుల్లో 57), దీప్తి శర్మ (58 బంతుల్లో 26 నాటౌట్) ఫరవాలేదనిపించారు.
ఓపెనర్ దేవిక వైద్యా (11) పరుగులు చేయగా... మిగతా వారంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో సోఫియా ఎక్లీస్టోన్, డానియెల్లీ హాజెల్ చెరో నాలుగు వికెట్లు తీసుకోగా, అలెక్స్ హార్ట్లీకి ఒక వికెట్ దక్కింది. భారత జట్టు నిర్దేశించిన 114 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ మహిళల జట్టు అలవోక లక్ష్యాన్ని చేధించింది.
29 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఇంగ్లాండ్ ఓపెనర్ డానియెల్లీ వ్యాట్(47) పరుగులు చేయగా ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అమీ జోన్స్ డకౌట్గా వెనుదిరిగింది. మరో ఓపెనర్ బీమౌంట్ ( 39 నాటౌట్) నిలకడగా ఆడుతూ ఇంగ్లాండ్ కెప్టెన్ హీథర్ నైట్ (26 నాటౌట్)తో కలిసి జట్టుకు విజయాన్ని అందించింది.
భారత బౌలర్లలో ఏక్తా బిస్థ్కు రెండు వికెట్లు దక్కాయి. ఈ మ్యాచ్లో తన అద్భుత ప్రదర్శనతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన స్పిన్నర్ సోఫియా ఎక్లీస్టోన్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.