లండన్: ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా పేలవ ప్రదర్శన కనబరుస్తున్న కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు బ్రిటిష్ మీడియా వరుస కథనాలను ప్రచురిస్తోంది. గార్డియన్ నివేదిక ప్రకారం.. జూలై తొలి వారంలో అంతర్జాతీయ క్రికెట్కు మోర్గాన్ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు అతని సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.
ఇయాన్ మోర్గాన్ సారథ్యంలోనే ఇంగ్లండ్ 2019 వన్డే ప్రపంచకప్ను గెలిచింది. ఈ టోర్నీ అనంతరం మోర్గాన్ ఒక్క ఇన్నింగ్స్ కూడా చెప్పుకోదగ్గ రీతిలో ఆడలేదు. టీ20 ప్రపంచకప్తో పాటు ఐపీఎల్లోనూ పేలవ ప్రదర్శన కనబర్చాడు. తాజాగా నెదర్లాండ్స్తో జరిగిన వన్డే సిరీస్లోనూ రెండు మ్యాచ్లు ఆడిన మెర్గాన్ కేవలం ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ మెర్గాన్ డకౌట్గా వెనుదిరిగాడు. గాయం కారణంగా అఖరి వన్డేకు మోర్గాన్ దూరమ్యాడు.
ఈ క్రమంలోనే తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఇయాన్ మోర్గాన్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాలనుకున్నట్లు అతని సన్నిహిత వర్గాలు తెలిపాయి. భారత్తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్కు ముందే ఈ నిర్ణయం వెలువడే అవకాశం ఉందని బ్రిటీష్ మీడియా పేర్కొంది. ఒక వేళ మోర్గాన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటే అతడి స్థానంలో వికెట్ కీపర్ జోస్ బట్లర్ ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అదే విధంగా 2015 నుంచి ఇంగ్లండ్ వైస్ కెప్టెన్గా బట్లర్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇక ఇంగ్లండ్-భారత మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ జూలై 7 న ప్రారంభం కానుంది.
ఇప్పటి వరకు 248 వన్డేలు ఆడిన మోర్గాన్ 7701 పరుగులు చేశాడు. 115 టీ20ల్లో 2458 పరుగులు సాధించాడు. 16 టెస్ట్లు మాత్రమే ఆడిన మోర్గాన్.. గతేడాది ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ను ఫైనల్కు చేర్చాడు.