మరో సూపర్ ఓవర్:
ప్రపంచకప్ అనంతరం న్యూజిలాండ్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరగిన తొలి ద్వైపాక్షిక సిరీస్లో నిర్ణయాత్మక మ్యాచ్ అయిన ఐదవ టీ20 మ్యాచ్కు కూడా సూపర్ ఓవర్ తప్పలేదు. ఈ సూపర్ ఓవర్లో కూడా ఇంగ్లండ్ విజేతగా నిలిచి సిరీస్ను 3-2 తేడాతో కైవసం చేసుకుంది. అయితే ఈ సూపర్ ఓవర్లో ఇంగ్లండ్ పరుగుల పరంగానే గెలిచింది.
వరుణుడు ఆటంకం.. మ్యాచ్ 11 ఓవర్లకు కుదింపు:
ఐదవ టీ20కి వరుణుడు ఆటంకం కల్గించడంతో మ్యాచ్ను 11 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఐదు వికెట్ల నష్దానికి 146 పరుగులు చేసింది. మార్టిన్ గప్టిల్ (50; 20 బంతుల్లో 3 పోర్లు, 5 సిక్సర్లు), మున్రో (46; 21 బంతుల్లో 2 పోర్లు, 4 సిక్సర్లు) చెలరేగారు. వీరికి తోడు సీఫెర్ట్ ( 39; 16 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సర్లు) కూడా బ్యాట్ ఝుళిపించడంతో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది.
మ్యాచ్ టై:
147 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ సైతం 11 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 146 పరుగులే చేసింది. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును బెయిర్ స్టో (47; 18 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు), ఇయాన్ మోర్గాన్ (17; 7 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) ఆదుకున్నారు. సామ్ కరాన్ (24; 11 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగాడు. చివరలో టామ్ కరాన్ ( 12; 9 బంతుల్లో 1 సిక్స్), క్రిస్ జోర్డాన్ (12 నాటౌట్; 3 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్), శామ్ బిల్లింగ్స్ (11 నాటౌట్; 10 బంతుల్లో 1 ఫోర్)లు పోరాడడంతో మ్యాచ్ టై అయ్యింది.
సూపర్ ఓవర్లో ఇంగ్లండ్ విజయం:
మ్యాచ్ టై అవ్వడంతో అంపైర్లు సూపర్ ఓవర్ నిర్వహించారు. కివీస్ తరఫున సూపర్ ఓవర్ను సౌతీ వేయగా.. ఇంగ్లండ్ తరఫున జోర్డాన్ వేశాడు. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా17 పరుగులు చేసింది. ఆ తర్వాత న్యూజిలాండ్ వికెట్ నష్టానికి 8 పరుగులే చేసి ఓటమి పాలైంది. దీంతో ఇంగ్లండ్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి.. సిరీస్ను 3-2 తేడాతో కైవసం చేసుకుంది.