|
బంతిని తెచ్చుకున్న మిచెల్ మార్ష్:
ఇంగ్లండ్ గడ్డపై టీ20 సిరీస్ని చేజార్చుకున్న ఆస్ట్రేలియా.. శుక్రవారం నుంచి వన్డే సిరీస్ ఆడుతోంది. మాంచెస్టర్ వేదికగా శుక్రవారం అర్ధరాత్రి ముగిసిన తొలి వన్డే మ్యాచ్లో ఇంగ్లండ్పై 19 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఇంగ్లాండ్ మిడిలార్డర్ బ్యాట్స్మెన్ శామ్ బిల్లింగ్స్ బ్యాటింగ్ చేస్తుండగా.. ఆసీస్ స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ చేస్తున్నాడు. 27వ ఓవర్ చివరి బంతిని బిల్లింగ్స్ భారీ షాట్ ఆడగా.. అది కీపర్ వెనకాల ఉన్న కార్ పార్కింగ్లోకి వెళ్లి పడింది. మైదానంలో అభిమానులు లేకపోవడంతో బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న మిచెల్ మార్ష్.. కార్ పార్కింగ్లోకి కెళ్లి బంతిని తెచ్చాడు.
గల్లీ అంతర్జాతీయ క్రికెట్:
మిచెల్ మార్ష్ కార్ పార్కింగ్లోకి పరుగెత్తికెళ్లి బంతిని తెచ్చే వీడియోను 'క్రికెట్ ఫ్రీక్జ్' తన ట్విట్టర్ ఖాతాల్లో పోస్ట్ చేసింది. 'గల్లీ అంతర్జాతీయ క్రికెట్' అనే కాప్షన్ పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో చూసిన అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 'అయ్యో దేవుడా!! ఎంతకష్టమొచ్చే' అని ఓ అభిమాని కామెంట్ చేయగా.. 'అభిమానులు లేకుంటే.. అలానే ఉంటది మరి' మరో అభిమాని కామెంట్ చేశాడు.
ఆదుకున్న మాక్స్వెల్:
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (6), అరోన్ ఫించ్ (16) నిరాశపరచగా.. లబుషేన్ (21), అలెక్స్ క్యారీ (10) ఆకట్టుకోలేకపోయారు. మార్కస్ స్టాయినిస్ (43) మాత్రమే పర్వాలేదనిపించారు. ఇక 23.4 ఓవర్లు ముగిసే సమయానికి 123/5తో నిలిచింది. గ్లెన్ మాక్స్వెల్ (77: 59 బంతుల్లో 4x4, 4x6), మిచెల్ మార్ష్ (73: 100 బంతుల్లో 6x4) హాఫ్ సెంచరీలు బాది ఆరో వికెట్కి 126 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దాంతో ఆస్ట్రేలియా 294 పరుగులు చేయగలిగింది. జోప్రా ఆర్చర్, మార్క్వుడ్ చెరో మూడు వికెట్లు తీశారు.
బిల్లింగ్స్ సెంచరీ:
295 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లీష్ ఓపెనర్ జేసన్ రాయ్ (3: 12 బంతుల్లో), జో రూట్ (1: 11 బంతుల్లో) తేలిపోయారు. మరో ఓపెనర్ జానీ బెయిర్ స్టో (84: 107 బంతుల్లో 4x4, 4x6) హాఫ్ సెంచరీ చేశాడు. పట్టుదలతో ఆడిన శామ్ బిల్లింగ్స్ (118: 110 బంతుల్లో 14x4, 2x6) సెంచరీ చేసాడు. స్లాగ్ ఓవర్లలో తడబడంతో ఇంగ్లండ్ 9 వికెట్ల నష్టానికి 275 పరుగులే చేయగలిగింది. ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్వుడ్ 3 వికెట్లు పడగొట్టగా.. ఆడమ్ జంపా 4 వికెట్లు పడగొట్టాడు. మూడు వన్డేల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో ఆసీస్ నిలిచింది. రెండో వన్డే మాంచెస్టర్లోనే ఆదివారం జరగనుంది.