
హైదరాబాద్: మహిళా క్రికెటర్ల కోసం ఐపీఎల్ తరహాలో ప్రయోగాత్మకంగా బీసీసీఐ మే 22న ప్రత్యేకంగా ఏకైక టి20 చాలెంజ్ మ్యాచ్ని నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ ఏకైక టీ20 మ్యాచ్లో భారత మహిళా క్రికెటర్లతో పాటు విదేశీ మహిళా క్రికెటర్లు సైతం పాల్గొనున్నారు.
ఈ మ్యాచ్లో రెండు జట్లకు కెప్టెన్లుగా స్మృతి మంధాన, హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యం వహించనున్నారు. మే 22న ముంబైలో జరగనున్న ఐపీఎల్-11 ఫ్లేఆఫ్ మ్యాచ్కు ముందు మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ మ్యాచ్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్ను స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

'ఈ మ్యాచ్లో పాల్గొనేందుకు ఆయా జట్ల క్రికెట్ బోర్డులతో సంప్రదింపులు చేశాం. న్యూజిలాండ్ కెప్టెన్ సుజీ బేట్స్, సోఫీ డివైన్, ఆసీస్ ఆల్రౌండర్ ఎలిసన్ పెర్రీ, వికెట్ కీపర్ అలీసా హీలీ, మెగాన్ షుట్, బెథ్ మూనీ, ఇంగ్లాండ్కు చెందిన మహిళా క్రికెటర్లు డేనియెల్లి వ్యాట్, హేజెల్ ఈ మ్యాచ్లో ఆడేందుకు సిద్ధం' అని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా తెలిపారు.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
మహిళ క్రికెటర్ల కోసం ప్రయోగాత్మకంగా బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయాన్ని న్యూజిలాండ్ బ్యాట్స్ఉమెన్ సోఫీ డివైన్ స్వాగతించింది. ఈ సందర్భంగా సోఫీ డివైన్ మాట్లాడుతూ 'ఐపీఎల్-11లో ఫ్లేఆఫ్ కంటే ముందు ఈ మ్యాచ్ నిర్వహించడం మహిళా క్రికెటర్లకు గొప్ప అవకాశం' అని పేర్కొంది.
'ఈ మ్యాచ్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. మహిళా క్రికెటర్ల కోసం ఇప్పటివరకూ బిగ్బాష్ లీగ్, కియా సూపర్ లీగ్లు చూశాం. మరికొన్ని సంవత్సరాలలో మహిళల కోసం ఐపీఎల్ మ్యాచ్లు కూడా రానున్నాయి. ఇది మహిళా క్రికెట్ అభివృద్ధికి తోడ్పాటునందిస్తుంది' అని పేర్కొంది.
బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం 'మహిళా క్రికెట్కు మరో గొప్ప అభివృద్ధి' అంటూ ఆస్ట్రేలియా బ్యాట్స్ఉమెన్ ఎలిసన్ పెర్రీ వెల్లడించింది. గతేడాది భారత జట్టు వన్డే వరల్డ్ కప్లో రన్నరప్గా నిలిచిన తర్వాత... మహిళల క్రికెట్కు మరింత ప్రాచుర్యం కల్పించే చర్యల్లో భాగంగా ఐపీఎల్ తరహాలో మహిళా క్రికెటర్లకు ఓ లీగ్ నిర్వహించాలని పలువురు బీసీసీఐని కోరిన సంగతి తెలిసిందే.