కరాచీ: భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ పునరుద్ధరణ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) స్పందించే వరకు తాము చర్చలు జరపబోమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ ఎహ్సన్ మణి స్పష్టం చేశారు. భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ల కోసం తామెంతగానో ప్రయత్నించామని, బీసీసీఐ నుంచి మాత్రం సరైన స్పందన రాలేదని ఆయన చెప్పాడు. గత కొన్నేళ్లుగా దాయాది దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు.
తాజాగా ఎహ్సన్ మణి ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ... 'భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య దౌత్య, రాజకీయ సంబంధాలు మెరుగయ్యే వరకు మేం క్రికెట్ వ్యవహారాల గురించి ఇక మాట్లాడం. ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగడానికి మేం ఎన్నో ఏళ్లుగా బీసీసీఐతో చర్చలు జరిపాం. ఎలాంటి స్పందన రాలేదు. ఇక భారత్తో టీ20 క్రికెట్ ఆడాలనే ఉద్దేశం మాకు లేదు. మొదటగా రెండు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ విభేదాలు తొలగిపోవాలి. పరిస్థితులన్నీ చక్కబడాలి. అప్పుడే మేం ఏదైనా మాట్లాడతాం' అని అన్నాడు.
'భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ల కోసం ఇకపై బీసీసీఐతో సంప్రదించను. వాళ్లేమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిబంధనల ప్రకారం ఏ ప్రభుత్వమూ క్రికెట్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. దీంతో ఐసీసీ.. బీసీసీఐతో మాట్లాడుతుందనుకుంటున్నా. 1990ల కాలంలో రెండు బోర్డుల మధ్య మంచి సంబంధాలు ఉండేవి. అప్పుడు నేను పీసీబీ ప్రతినిధిగా ఉన్నప్పుడు.. బీసీసీఐ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్లు అయిన జగ్మోహన్ దాల్మియా, శరద్ పవార్, మాధవరావు సింథియాలతో బాగా మాట్లాడేవాడిని. వారితో మంచి అనుబంధం ఉంది' అని పీసీబీ ఛైర్మన్ పేర్కొన్నాడు.
'గత 12 ఏళ్లుగా సంబంధాలు దెబ్బతిన్నాయి. రెండు బోర్డుల మధ్య ఉండాల్సిన రీతిలో పరిస్థితులు లేవు. బీసీసీఐ, పీసీబీ రెండూ నమ్మకం, స్వేచ్ఛగా మాట్లాడుకునేలా ఉండాలి. 2018లో నేను పీసీబీ ఛైర్మన్గా తిరిగి బాధ్యతలు తీసుకున్నాక ఇప్పుడున్న పరిస్థితులు చూసి నిరాశ చెందా. ఒక్కో సమయంలో నన్ను షాక్కు గురిచేశాయి. రెండు జట్ల మధ్య క్రికెట్ బలోపేతం కోసం ప్రయత్నించా. కానీ బీసీసీఐ నుంచి ఎలాంటి స్పందన రాలేదు' అని ఎహ్సన్ మణి చెప్పుకొచ్చాడు.
2013 జనవరిలో పాక్ జట్టు భారత్లో రెండు టీ20లు, మూడు వన్డేలు ఆడిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచీ ఇరు జట్ల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్లు జరగలేదు. కేవలం ఐసీసీ, లేదా ఆసియా కప్ల సందర్భంగానే దాయాది దేశాలు తలపడుతున్నాయి. ఇక 2007-2008 సీజన్లో ఇరు జట్లు చివరిసారి టెస్టు సిరీస్ ఆడాయి. చివరగా వన్డేల్లో 2019 ప్రపంచకప్ ఆడగా.. భారత్ సాధించింది. ఈ ఏడాది ఆసియా కప్లో తలపడాల్సి ఉండగా.. కరోనాతో టోర్నీ వాయిదా పడింది.
Mumbai Indians జట్టులో అర్జున్ టెండూల్కర్.. ట్రెంట్ బౌల్ట్తో కలిసి..!!