
హైదరాబాద్: ఐర్లాండ్తో మూడు టీ20ల సిరిస్కు ఎంపిక చేసిన 13 మంది జట్టు సభ్యుల్లో డ్వేన్ బ్రావో, రోవ్మన్ పావెల్లకు సెలక్టర్లు చోటు కల్పించారు. ఇటీవలే తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్న నేపథ్యంలో వెస్టిండిస్ సెలక్టర్లు ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావోను మళ్లీ జట్టులోకి ఎంపిక చేశారు.
2016లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా పాకిస్థాన్తో వెస్టిండిస్ తరుఫున చివరి మ్యాచ్ ఆడిన డ్వేన్ బ్రావో ఆ తర్వాత వెస్టిండిస్ బోర్డుతో తలెత్తిన విబేధాల కారణంగా క్రికెట్కు వీడ్కోలు పలికాడు. అయితే, ఇటీవలే వెస్టిండిస్ క్రికెట్కు పూర్వవైభవం తెచ్చేందుకు గాను బోర్డులో సమూల మార్పులు చేశారు.
దీంతో తన పునరాగమనంపై ఆశలు పెట్టుకున్న డ్వేన్ బ్రావోకు ఊహించినట్లుగానే జట్టు మేనేజ్మెంట్ అతడికి జట్టులో చోటు కల్పించింది. మరోవైపు ఐర్లాండ్తో సిరీస్కు విండిస్ టెస్టు కెప్టెన్ జాసన్ హోల్డర్కు విశ్రాంతి కల్పించగా... ఫాబియన్ అలెన్ గాయం నుంచి కోలుకోలేకపోవడంతో అతడు ఈ సిరిస్కు దూరమయ్యాడు.
డ్వేన్ బ్రావో ఎంపికపై క్రికెట్ వెస్టిండీస్ లీడ్ సెలెక్టర్ రోజర్ హార్పర్ మాట్లాడుతూ "మా 'డెత్' బౌలింగ్ను బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతో డ్వేన్ బ్రావోను ఎంపిక చేశాం. డెత్ ఓవర్లలో నిజంగా మేము పుంజుకోవాల్సి ఉంది. డెత్ ఓవర్లలో డ్వేన్ బ్రావో రికార్డు గురించి చెప్పాల్సిన పనిలేదు. అతడి అనుభవం అవసరమైన చోట అతడు మెంటార్గా వ్వవహారించగలడు" అని తెలిపాడు.
ఇప్పటికే ఐర్లాండ్తో ముగిసిన మూడు వన్డేల సిరిస్ను వెస్టిండిస్ 3-0తో క్లీవ్ స్వీప్ చేయగా... ఇరు జట్ల మధ్య మూడు టీ20ల సిరిస్ జనవరి 15 నుంచి ప్రారంభం కానుంది.