
హైదరాబాద్: మరోసారి వర్షంతో మ్యాచ్కి అడ్డంకి ఏర్పడినా ఓడిపోకూడదని ఓవర్కి కనీసం ఒక బౌండరీ చొప్పున బాదామని మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రజెంటేషన్ కార్యక్రమంలో దక్షిణాఫ్రికా మిడిలార్డర్ బ్యాట్స్మెన్ హెన్రిచ్ క్లాసెన్ వెల్లడించాడు.
సెంచూరియన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టులో మనీశ్ పాండే (79 నాటౌట్: 48 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులు), మహేంద్ర సింగ్ ధోని (52 నాటౌట్: 28 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులు) హాఫ్ సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.
అనంతరం 189 పరుగుల విజయ లక్ష్యంతో సఫారీ జట్టు బరిలోకి దిగిన కొద్దిసేపటికే చిరుజల్లు కురవడం ప్రారంభమైంది. దీంతో మ్యాచ్ని అంపైర్లు నిలిపివేసి డక్వర్త్ లూయిస్ పద్ధతిలో విజేతని ప్రకటిస్తారేమోనని కంగారుపడిన డుమిని (64), క్లాసెన్ (69) దూకుడుగా ఆడటంతో దక్షిణాఫ్రికా 18.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 189 పరుగులతో లక్ష్యాన్ని చేధించింది.
ఈ మ్యాచ్లో 30 బంతుల్లో 69 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సఫారీ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
మ్యాచ్ అనంతరం క్లాసెన్ మాట్లాడుతూ 'నా మొత్తం ఇన్నింగ్స్లో డుమిని కీలకపాత్ర పోషించాడు. నేను ఎదుర్కొన్న తొలి ఓవర్తో పాటు రెండో ఓవర్లో ఓవర్కు పది పరుగులు చేయాలని చెప్పాడు. బౌలర్లపై దృష్టి కేంద్రీకరించి నా సాధారణ ఆటను ఆడమని చెప్పాడు. అదృష్టం కొద్దీ ఈరోజు అది వర్క్ అయింది' అని అన్నాడు.
'ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో చిరుజల్లు కురిసింది. అప్పటికి దక్షిణాఫ్రికా స్కోరు 50/2. కానీ.. డక్వర్త్ లూయిస్ పద్ధతిలో మా జట్టు గెలవాలంటే 54 పరుగులు చేసుండాలి. దీంతో ఎక్కడ అంపైర్లు మ్యాచ్ని నిలిపివేసి విజేతను ప్రకటిస్తారోనని కొంచెం కంగారుపడ్డా. అయితే లక్కీగా మ్యాచ్ను కొనసాగించారు' అని చెప్పాడు.
'మరోసారి వర్షంతో మ్యాచ్కి అడ్డంకి ఏర్పడినా ఓడిపోకూడదని ఓవర్కి కనీసం ఒక బౌండరీ చొప్పున బాదాలని కెప్టెన్ డుమినితో అన్నాను. ఈ వ్యూహంలో భాగంగానే చాహల్ బౌలింగ్లో భారీ షాట్లు ఆడాం. ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన చాహల్ బౌలింగ్లో 6, 6, 4, 1, 0, 6 ఇలా నేను, డుమిని కొడతామని ఊహించలేదు' అని పేర్కొన్నాడు.
'తొలి సిక్స్ తర్వాత కొట్టగలననే నమ్మకంతో హిట్టింగ్ చేశా. నా సొంత మైదానంలో రాణించడం చాలా సంతోషంగా ఉంది' అని క్లాసెన్ వెల్లడించాడు. రెగ్యులర్ వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్ గాయపడటంతో అనూహ్యాంగా క్లాసెన్ చోటు దక్కించుకున్నాడు. ఇక, మూడు టీ20ల సిరిస్ విజేత నిర్ణయించే నిర్ణయాత్మక మూడో టీ20 శనివారం కేప్టౌన్ వేదికగా జరగనుంది.