
ముంబై: క్రికెటర్గా దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఇమ్రాన్ ఖాన్ దేశ ప్రధానిగా ఎన్నికై పెను మార్పులకు తెరలేపుతానంటూ మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు. తమ పాలనలో మైనారిటీలను ఎలా చూసుకోవాలో తాము మోడీ ప్రభుత్వానికి చూపిస్తామంటూ పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలను చేశారు. ఈ మేర భారత్లో కొన్ని వర్గాల వారు వ్యతిరేక వ్యాఖ్యాలతో ఖండిస్తున్నారు. వారితో పాటు ఇమ్రాన్ తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ మొహ్మద్ కైఫ్ కూడా ఘాటుగానే స్పందించాడు. భారత్ విషయంలో పాక్ ఉపదేశాలివ్వడం మానుకుంటే మంచిదని కౌంటర్ ఇచ్చాడు.
ట్విట్టర్ ద్వారా తెలిపిన ఇమ్రాన్ వ్యాఖ్యలను ఆయన రీ ట్వీట్ చేస్తూ... 'విభజన (పాకిస్థాన్-భారత్) సమయంలో పాక్లో 20 శాతం మైనార్టీలు ఉండేవారు. ప్రస్తుతం 2 శాతం ఉన్నారు. మరోవైపు, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతి నుంచి భారత్లో మైనార్టీల జనాభా పెరుగుతూనే ఉంది. మైనార్టీల గురించి ఏ దేశానికైనా పాఠాలు చెప్పాలనుకుంటే ఆ అర్హత ఉండే దేశాల జాబితాలో పాకిస్థాన్ చివరి స్థానంలో ఉంటుంది' అని ట్విటర్లో విమర్శించారు.
కాగా, ఇటీవల ఇమ్రాన్ ఖాన్ లాహోర్లోని ఓ సమావేశంలో మాట్లాడుతూ... 'మా ప్రభుత్వం మైనార్టీల హక్కుల పరిరక్షణకు పలు చర్యలు తీసుకుంటుంది. మైనార్టీల పట్ల ఎలా వ్యవహరించాలన్న విషయాన్ని మోడీ ప్రభుత్వానికి చూపుతాం. మైనార్టీలను తమ దేశ పౌరులతో సమానంగా ప్రభుత్వం చూడడం లేదని భారతీయులు కూడా అంటున్నారు' అని వ్యాఖ్యానించారు.
ఆయన చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ నేతలతో పాటు పలువురు ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులకు రక్షణ కల్పించే పాక్.. ముందు తమ దేశ పరిస్థితి గురించా ఆలోచించాలని విమర్శించారు.