మే30 నుంచి వరల్డ్కప్
మే30 నుంచి వరల్డ్కప్ ఆరంభం కానుండగా.. షెడ్యూల్ ప్రకారం జూన్ 16న మాంచెస్టర్ వేదికగా భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్పై ఐసీసీ సీఈఓ డేవ్ రిచర్డ్సన్ మాట్లాడుతూ "ఐసీసీ టోర్నీలలో పాల్గొనడానికి సంబంధించి అన్ని సభ్య దేశాలతో జరిగిన ఒప్పందం ప్రకారం ఆయా జట్లు టోర్నీలో అన్ని మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది" అని అన్నారు.
ప్రత్యర్థి జట్టుకు పాయింట్లు ఇస్తాం
"సరైన కారణం లేకుండా ఎవరైనా దీనిని ఉల్లంఘిస్తే ప్రత్యర్థి జట్టుకు పాయింట్లు ఇస్తాం. కాబట్టి మ్యాచ్ జరుగుతుందనే భావిస్తున్నా" అని రిచర్డ్సన్ అన్నారు. అంతేకాదు వరల్డ్ కప్లో ఆటగాళ్లు, అభిమానుల భద్రతకే ప్రథమ ప్రాధాన్యం, ఇందులో ఏమాత్రం నిర్లక్ష్యానికి తావివ్వబోమని స్పష్టం చేశారు.
న్యూజిలాండ్ ఉగ్రదాడిపై
న్యూజిలాండ్లోని క్రైస్ట్చర్చ్ మసీదుల్లో జరిగిన ఉగ్రదాడిలో 50 మంది మరణించగా, ఇరవై మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనలో బంగ్లాదేశ్ క్రికెట్ క్రీడాకారులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అనంతరం న్యూజిలాండ్తో జరగాల్సిన మూడో టెస్టుని రద్ధు చేసుకుని హుటాహుటిన స్వదేశానికి తిరుగు పయనమైన సంగతి తెలిసిందే.
ఆటగాళ్ల భద్రతపై ఆదేశాలు
అయితే, ఈ మ్యాచ్ రద్దుకు ఐసీసీ కూడా అంగీకరించింది. న్యూజిలాండ్లో జరిగిన దాడి గురించి ప్రస్తావిస్తూ రాబోయే వన్డే వరల్డ్కప్లో ఆటగాళ్లు, అభిమానుల భద్రతకే మొదటి ప్రాధాన్యమని పేర్కొన్నాడు. "ఇప్పటికే సెక్యూరిటీ విషయంలో ఐసీసీ అత్యంత జాగ్రత్త వహిస్తోంది. వరల్డ్కప్ జరగనున్న వేదికల్లో భద్రతపై ఇప్పటికే ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డులు ఆ దేశ అధికారులకు పటిష్ట భద్రతపై ఆదేశాలు జారీ చేశాయి" అని అన్నారు.