పాకిస్తాన్ 150/5 స్కోరుతోనే
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు సాధించింది. బాబర్ అజమ్(50), ఫర్హాన్(39)లు శుభారంభం ఇవ్వగా, హఫీజ్(32 నాటౌట్) ఆకట్టుకున్నాడు. ఆపై 151 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ 19.1 ఓవర్లలోనే 117 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆసీస్ ఆటగాళ్లలో బెన్ మెక్డెర్మాట్(21), మిచెల్ మార్ష్(21)లదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం.
సిరీస్లో ఆసీస్కు కనీసం ఒక్క విజయం కూడా
పాక్ బౌలర్లలో షాదబ్ ఖాన్ మూడు వికెట్లతో మెరవగా, హసన్ అలీకి రెండు వికెట్లు లభించాయి. ఆష్రాఫ్, హఫీజ్, ఉస్మాన్ ఖాన్లు తలో వికెట్ తీశారు. ఆసీస్తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ను సైతం పాకిస్తాన్ 1-0 గెలిచిన సంగతి తెలిసిందే. దాంతో ఈ ద్వైపాక్షిక సిరీస్లో ఆసీస్కు కనీసం ఒక్క విజయం కూడా లభించలేదు. పాకిస్తాన్ జట్టు టీ20ల్లో తన కంటే వరల్డ్ ర్యాంకింగ్లో మెరగైన ఆసీస్పై విజయం సాధించి ముందుకెళ్లింది.
ఇంటర్వెల్స్తో ఆసీస్ జట్టు వికెట్లు కోల్పోతూనే
అబుదాబి వేదికగా 66పరుగుల తేడాతో దుబాయ్ వేదికగా 11పరుగుల తేడాతో ఆధిక్యాన్ని దక్కించుకుంది. దానికి కారణం ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ బలహీనంగా కనపించడమే. కేవలం ఇదే సిరీస్ తొలి గేమ్లో 89పరుగులకే సరిపెట్టుకోవడం మరీ దారుణమైన విషయం. ఇమ్దాద్ వసీం ఓవర్లో కారె రెండు ఫోర్లు, రెండు సిక్సులతో ఇన్నింగ్స్ ఆరంభించాడు. ఆ తర్వాత రెగ్యూలర్ ఇంటర్వెల్స్తో ఆసీస్ జట్టు వికెట్లు కోల్పోతూనే వచ్చింది.
మా శ్రమకు ఇది నిదర్శనం
పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. 'మా శ్రమకు ఇది నిదర్శనం. జట్టులోని అందరూ తీవ్రంగా కృషి చేయడంతో ఇది సాధ్యమైంది. మా కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చిందని ఆశిస్తున్నాం. ఇదే ఆటతీరును న్యూజిలాండ్తో జరగనున్న సిరీస్లోనూ ప్రదర్శించి జట్టును గెలిపించేందుకు ప్రయత్నిస్తాం. ఈ మ్యాచ్లో క్యాచ్లు.. బౌలింగ్లతో అద్భుతమైన ఫీల్డింగ్ కనబరిచాం' అంటూ సర్ఫరాజ్ అహ్మద్ తమ జట్టును కొనియాడాడు.