వరుస వైఫల్యాలు
టీమిండియాలో పొట్టి ఫార్మాట్లో అత్యంత దారుణంగా ఫెయిల్ అవుతున్న ఆటగాడు ఎవరు? అనగానే టక్కున గుర్తొచ్చే పేరు రిషభ్ పంత్. ఇదే విషయాన్ని చెప్పిన ఆకాష్ చోప్రా.. జట్టులో అతని స్థానం ఏంటని ప్రశ్నించాడు. అతని రికార్డు చూస్తే ఇప్పటి వరకు టీ20 ఫార్మాట్లో 66 మ్యాచులు ఆడిన పంత్.. 22.43 సగటుతో 987 పరుగులు మాత్రమే చేశాడు. అలాంటి వాడిని కివీస్తో సిరీస్లో వైస్ కెప్టెన్గా నియమించారు. ఈ నిర్ణయంపై కూడా ఆకాష్ చోప్రా కొన్ని సందేహాలు లేవనెత్తాడు.
ఓపెనర్గానూ ఫెయిల్
న్యూజిల్యాండ్తో ఆడిన రెండు మ్యాచుల్లో ఓపెనర్గా వచ్చిన రిషభ్ పంత్ రెండో మ్యాచులో 13 బంతులు ఎదుర్కొని కేవలం 6 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మూడో టీ20లో 5 బంతుల్లో 11 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ రెండు మ్యాచుల్లో ఒకే తరహా బంతికి పంత్ వికెట్ పారేసుకున్నాడు. 'ఈ రెండు మ్యాచుల్లో రిషభ్ పంత్ చాలా పేలవంగా ఆడాడు. ఇప్పుడు మరోసారి పాతపడిపోయిన అదే ప్రశ్నను తవ్వి తీయాల్సి వస్తోంది. అతను ఓపెనరా? లేక మీరే పంత్ను ఓపెనర్గా మార్చాలని అనుకుంటున్నారా?' అని చోప్రా ప్రశ్నించాడు.
జట్లులో అవసరమా..?
అసలు టీమిండియాలో పంత్కు స్థానం ఉందా? జట్టులో అతను అవసరమా? అని ఆకాష్ చోప్రా అడిగాడు. లేదంటే ఇంత సత్తా ఉన్న ఆటగాడు వేస్ట్ అవకూడదని ఓపెనర్గా ఆడిస్తున్నారా? అని ప్రశ్నించాడు. 'ఈ టీంలో అతన్ని వైస్ కెప్టెన్ చేశారు. అంటే అతను అన్ని మ్యాచుల్లో ఆడాలనేది ప్లాన్. కానీ అతను ఆడితే ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలి? రిషభ్ పంత్లో బెస్ట్ ఎలా బయటకు తీసుకురావాలనేదే టీం మేనేజ్మెంట్, సెలెక్టర్ల ముందు ఉన్న అతి పెద్ద సవాల్' అన్నాడు.