
హైదరాబాద్: స్టీవ్ స్మిత్... మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో ఒకడు. అయితే బాల్ టాంపరింగ్ వివాదం కారణంగా అతడి ప్రతిష్ట మసకబారింది. కేప్టౌన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో బాల్ టాంపరింగ్కు పాల్పడిన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్లపై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
దీంతో ఏడాదిపాటు నిషేధం ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఏం చేస్తున్నాడా? అని సగటు క్రికెట్ అభిమాని మదిలో ఉన్న ప్రశ్న. అయితే, లండన్కు చెందిన ఓ పత్రిక కథనం ప్రకారం స్మిత్ కాలిఫోర్నియాలో ఫాక్స్ టెల్ స్పోర్ట్స్కి కామెంటేటర్గా బాధ్యతలు నిర్వహించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు.
సఫారీ గడ్డపై ఆతిథ్య దక్షిణాఫ్రికాతో కేప్టౌన్ వేదికగా జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరూన్ బాన్క్రాఫ్ట్లు బాల్ టాంపరింగ్కు పాల్పడిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణకు ఆదేశించిన క్రికెట్ ఆస్ట్రేలియా స్మిత్, వార్నర్పై 12 నెలల నిషేధం విధించింది.
మరోవైపు బంతి ఆకారాన్ని మార్చేందుకు యత్నించిన కామెరూన్ బాన్క్రాప్ట్పై 9 నెలలు నిషేధం విధించింది. క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధంతో స్మిత్, వార్నర్లు ప్రస్తుతం భారత్లో జరుగుతోన్న ఇండియన ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు దూరమయ్యారు.
ఈ ఏడాది జనవరిలో జరిగిన వేలానికి ముందు ప్లేయర్ రిటెన్షన్లో స్టీవ్ స్మిత్ను రాజస్థాన్ రాయల్స్ తన వద్దే అట్టిపెట్టుకుని కెప్టెన్సీ బాధ్యతలు అందించింది. ఆ తర్వాత బాల్ టాంపరింగ్ వివాదం వెలుగులోకి రావడం, క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించడంతో స్మిత్ స్థానంలో రహానేకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది.
కాగా, బాల్ టాంపరింగ్ వివాదంపై ఏడాది పాటు నిషేధం ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అభిమానులు ఊహించని నిర్ణయం తీసుకున్నారు. తనపై క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) విధించిన నిషేధ నిర్ణయంపై సవాల్ చేయబోనని స్టీవ్ స్మిత్ ప్రకటించాడు. క్రికెట్ ఆస్ట్రేలియా విధించిన నిషేధాన్ని ఎదుర్కొంటానని తెలిపారు.
'కెప్టెన్గా ఈ వివాదంలో పూర్తి బాధ్యత తీసుకుంటానని ఇంతకుముందే చెప్పాను. ఆ మాటకు కట్టుబాడి ఉన్నాను. నేను ఇంకా చెప్పాల్సింది ఏమీ లేదు. నాపై విధించిన ఆంక్షలను సవాల్ చేయడం లేదు. గట్టి సందేశం ఇచ్చే ఉద్దేశంతో క్రికెట్ ఆస్ట్రేలియా ఈ చర్యలు తీసుకుంది. వాటిని నేను ఆమోదిస్తున్నాను' అని ట్వీట్ చేశాడు.