న్యూఢిల్లీ: టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ హనుమ విహారిపై వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ప్రశంసల జల్లు కురిపించాడు. రంజీ ట్రోఫీలో భాగంగా మధ్యప్రదేశ్తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆంధ్ర కెప్టెన్ అయిన విహారి మణికట్టు విరిగినా బ్యాటింగ్ చేసిన విషయం తెలిసిందే. రెండు ఇన్నింగ్స్ల్లో ఒంటి చేత్తో రైట్ హ్యాండర్ అయిన విహారి లెఫ్టాండ్ బ్యాటింగ్ చేశాడు. ఒంటి చేత్తో బౌండరీలను కూడా బాదాడు. విహారి ఇంటెన్షన్ను అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు ప్రశంసించాడు.
ఇక రెండో ఇన్నింగ్స్ సందర్భంగా ఒంటి చేత్తో విహారి కొట్టిన ఓ రివర్స్ స్వీప్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియోను రీట్వీట్ చేసిన దినేశ్ కార్తీక్.. ''ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్ (నవ్వుతున్న ఎమోజీ). ఇందులో బౌలర్ తప్పిదం ఏమీ లేదు. అయితే ఇదొక విభిన్నమైన షాట్'' అని ప్రశంసించాడు.
It's a REVERSE SLAP not a reverse sweep 😂
— DK (@DineshKarthik) February 3, 2023
No offence to the bowler, but that was quite a shot https://t.co/iNjDjxPJsL
విహారి ఒంటి చేత్తో పోరాడినా మధ్యప్రదేశ్పై ఆంధ్రకు ఓటమి తప్పలేదు. తొలి ఇన్నింగ్స్లో ఆంధ్ర 379/10 స్కోరు సాధించగా.. మధ్యప్రదేశ్ 228/10 చేయడంతో ఆంధ్ర 151 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్లో ఆంధ్ర కేవలం 93 పరుగులకే కుప్పకూలింది. దీంతో 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్.. ఐదు వికెట్లను మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. యశ్ దుబే(58), రజత్ పటీదార్(55) హాఫ్ సెంచరీలతో రాణించగా.. శుభామ్ శర్మ(40), సరన్షా జైన్(28 నాటౌట్) విలువైన పరుగులు చేశారు.
ఆంధ్ర బౌలర్లలో లలిత్ మోహన్, పృథ్వీ రాజ్ రెండేసి వికెట్లు తీయగా.. నితీశ్ కుమార్ రెడ్డి ఓ వికెట్ పడగొట్టాడు. ఈ ఓటమితో ఆంధ్రా జట్టు ఇంటిముఖం పట్టగా... మధ్య ప్రదేశ్ సెమీస్లో బెంగాల్తో అమీతుమీ తేల్చుకోనుంది. హనుమ విహారికి మణికట్టుకు దెబ్బ తగలడం ఆంధ్రప్రదేశ్ ఓటమిని శాసించింది. తొలి ఇన్నింగ్స్ సందర్భంగా ఆవేశ్ ఖాన్ వేసిన రాకాసి బౌన్సర్ విహారి ఎడమి చేతి మణికట్టుకు బలంగా తాకింది. హనుమ విహారి.. 2020-21 బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ సందర్భంగా ఆసీస్పై వీరోచిత ఇన్నింగ్స్ ఆడి జట్టును ఓటమి నుంచి తప్పించాడు. తొడకండరాల గాయాన్ని లెక్క చేయకుండా క్రీజులో అడ్డుగోడలా నిలిచాడు.