వైరల్ వీడియో.. 'మాస్టర్' సినిమా పాటకు ఆటగాళ్ల స్టెప్పులు!! (వీడియో)

చెన్నై: అద్భుత ఆటతీరుతో తమిళనాడు జట్టు రెండోసారి సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. 2006-07 ఆరంభ సీజన్లో టీమిండియా బ్యాట్స్మన్ దినేశ్ కార్తీక్ ఆధ్వర్యంలోనే విజేతగా నిలిచిన తమిళనాడు జట్టు.. 13 ఏళ్ల తర్వాత అజేయ ఆటతీరుతో మరోసారి చాంపియన్గా నిలిచింది. ఆదివారం అహ్మదాబాద్లోని మొతెరా మైదానంలో జరిగిన ఫైనల్లో తమిళనాడు 7 వికెట్ల తేడాతో బరోడాపై ఘన విజయం సాధించింది. లెఫ్టామ్ స్పిన్నర్ ఎం సిద్దార్థ్ (4/20), ఓపెనర్ హరి నిషాంత్ (35), కెప్టెన్ దినేష్ కార్తీక్ (22), బాబా అపరాజిత్ (29 నాటౌట్) విజయంలో కీలక పాత్ర పోషించారు.
'విజయ్' స్టెప్పులు వేసిన కార్తీక్:
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీని సొంతం చేసుకున్న తమిళనాడు జట్టు సంబరాల్లో మునిగిపోయింది. డ్రెసింగ్ రూంలో ఆటగాళ్లు సందడి చేశారు. విజయానందం పట్టలేక దినేశ్ కార్తీక్ సారథ్యంలోని ఆటగాళ్లు స్టెప్పులేశారు. ఇటీవల విడుదలైన దళపతి విజయ్ నటించిన 'మాస్టర్' సినిమాలోని 'వాత్తి కమింగ్' పాటకు స్టెప్పులు వేశారు. పాటకు అనుగుణంగా మొదటగా కార్తీక్ డాన్స్ వేయగా.. ఆపై మిగతావారు అతనికి జతకలిశారు. దీనికి సంబందించిన వీడియోను కోల్కతా నైట్ రైడర్స్ ప్రాంచైజీ ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ఇప్పుడా వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

దేశానికి ఆడడంపైనే నా దృష్టి:
తాజాగా దినేశ్ కార్తీక్ మాట్లాడుతూ... 'రాష్ట్ర క్రికెట్ను ముందుకు తీసుకెళ్లడంతో పాటు దేశానికి ఆడడంపైనే నా దృష్టి. గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ ఫైనల్లో ఒక్క పరుగు తేడాతో ఓడిపోవడం చాలా బాధ కలిగించింది. ఈ సీజన్లో మేం మంచి క్రికెట్ ఆడాం. నిలకడగా విజయాలు సాధించాం. గతేడాది మాతో పాటు జట్టులో ఉన్న టీ నటరాజన్, వాషింగ్టన్ సుందర్ లాంటి ఆటగాళ్లు ఈ సారి టీమిండియాకు ఆడారు. రాబోయే రోజుల్లో మరింత మంది తమిళనాడు క్రికెటర్లు జాతీయ జట్టుకు ఆడతారని ఆశిస్తున్నా' అని అన్నాడు.

సిద్దార్థ్ మాయ:
ఫైనల్లో టాస్ గెలిచి తమిళనాడు ఫీల్డింగ్ ఎంచుకోగా.. తొలుత బరోడా బ్యాటింగ్కు దిగింది. లెఫ్టార్మ్ స్పిన్నర్ సిద్దార్థ్ (4/20) విజృంభించడంతో బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 120 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఒక దశలో 36 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన బరోడాను అతీత్ సేథ్ (29)తో కలిసి విష్ణు సోలంకి (49; 55 బంతుల్లో 1×4, 2×6) ఆదుకున్నాడు. స్వల్ప ఛేదనను తమిళనాడు ఆడుతూ పాడుతూ ముగించింది. మరో రెండు ఓవర్లుండగానే మ్యాచ్ను ముగించింది.

అశ్విన్, నటరాజన్, సుందర్ లేకున్నా:
ప్రముఖ ఆటగాళ్లు జట్టుకు దూరమైనా తమిళనాడు అదరగొట్టింది. టీమిండియా విధుల్లో బిజీగా ఉన్న ఆర్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, టీ నటరాజన్, సందీప్ వారియర్ (నెట్ బౌలర్) జట్టుకు అందుబాటులో లేరు. స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా, ఆల్రౌండర్ విజయ్ శంకర్ పెళ్లి వల్ల ఆడలేకపోయారు. అయినా సీనియర్ ప్లేయర్ దినేశ్ కార్తీక్ సారథ్యంలోని తమిళనాడు సత్తాచాటింది. గతేడాది ఫైనల్లో అందినట్టే అంది చేజారిన టైటిల్ను ఈసారి పట్టేసింది. ఈ ఏడాది టోర్నీ మొత్తం అజేయంగా నిలిచి విజేతగా అవతరించింది.
'ఇంగ్లండ్ ఒక్క టెస్ట్ కూడా గెలువడం కష్టమే.. పింక్ బాల్ టెస్టులోనే కాస్త ఆలోచిస్తున్నా'
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications