ఇంగ్లాండ్ వేదికగా 2019 వన్డే వరల్డ్కప్ మే 30 నుండి జరగనుంది. ఈ మెగా టోర్నీలో పాల్గొనే శ్రీలంక జట్టుకు సారథ్యం వహిస్తామనుకున్న వెటరన్ పేసర్ లసిత్ మలింగకు శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) షాక్ ఇచ్చింది. మలింగ స్థానంలో శ్రీలంక టెస్టు కెప్టెన్ దిముత్ కరుణరత్నెను కెప్టెన్గా నియమించింది.
శ్రీలంక క్రికెట్ గురువారం వరల్డ్కప్ జట్టులో పాల్గొనే జట్టును ప్రకటించనుంది. ఇటీవల దక్షిణాఫ్రికా గడ్డపై లంక 2-0తో టెస్టు సిరీస్ గెలిచి.. ఈ ఘనత సాధించిన తొలి ఆసియా జట్టుగా రికార్డుల్లోకి ఎక్కింది. ఆ సిరీస్లో లంక జట్టుకు కరుణరత్నె కెప్టెన్గా ఉన్నాడు. అదే పర్యటనలో మలింగ సారథ్యంలోని వన్డే జట్టు 0-5తో సిరీస్ కోల్పోయింది.
వరల్డ్కప్ లాంటి మెగా టోర్నీలో మంచి కెప్టెన్ ఉండాలని భావించిన లంక బోర్డు కరుణరత్నెకు వన్డే పగ్గాలు అప్పగించింది. కరుణరత్నె చివరి సారిగా 2015 వరల్డ్కప్లో ఆడాడు. ఆ తర్వాత వన్డే జట్టులో చోటు దక్కించుకోలేదు. అయితే టెస్టుల్లో అద్భుతంగా రాణించడంతో ఏకంగా 2019 వన్డే వరల్డ్కప్లో కెప్టెన్గా అవకాశం దక్కించుకున్నాడు.