ఐసీసీ టీ20 వరల్డ్కప్ 2022లో భారత క్రికెట్ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ గొప్ప ఫినిషర్ కాగలడని భారత మాజీ చీఫ్ సెలెక్టర్ దిలీప్ వెంగ్సర్కార్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఉమ్రాన్ మాలిక్, శుభ్ మాన్ గిల్, మహ్మద్ షమీ భారత మెయిన్ జట్టులో ఎంపిక కావాల్సిందని కూడా పేర్కొన్నాడు. ఈ ముగ్గురూ ఐపీఎల్లో బాగా రాణించిన సంగతి తెలిసిందే. గుజరాత్ టైటాన్స్ వారి ప్రారంభ సీజన్లో ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోవడంలో షమీ, గిల్ కీలకపాత్ర పోషించారు. మాలిక్ సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున తన ఎక్స్ప్రెస్ పేస్తో ఆకట్టుకున్నాడు.
'నేను మహ్మద్ షమీ, ఉమ్రాన్ మాలిక్, శుభ్మాన్ గిల్లను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేసి ఉండేవాడిని. వారందరికీ ఐపీఎల్ సీజన్ అద్భుతంగా ఉంది. వారికి టీ20లలో లాంగ్ రన్ అందించి ఉండేవాడిని.' అని వెంగ్సర్కార్ పేర్కొన్నాడు. సూర్యకుమార్ యాదవ్ 2021లో ఇంగ్లాండ్పై అంతర్జాతీయంగా అరంగేట్రం చేసినప్పటి నుండి 13 టీ20లలో 340పరుగులు చేశాడు.
అలాగే 28వన్డేలలో 811 పరుగులు చేశాడు. 'ఎవరు ఏ నంబర్లో బ్యాటింగ్ చేస్తారనే విషయమై నేను చెప్పదల్చుకోలేదు. అది జట్టులోని థింక్ థంక్ అయిన కోచ్, కెప్టెన్, వైస్ కెప్టెన్ మీద ఆధారపడి ఉంటుంది. సూర్యకుమార్ యాదవ్ నంబర్ 5 స్థానంలో కూడా సూపర్బ్గా బ్యాటింగ్ చేయగలడని నేను భావిస్తున్నాను. అతను గొప్ప ఫినిషర్ కాగలడు' అని వెంగ్ సర్కార్ చెప్పాడు.
టీ20లు.. వన్డేలు, టెస్ట్ క్రికెట్ లాంటిది కాదు.. ఇక్కడ మీకు నిర్దిష్ట స్థానాల్లో నిర్దిష్ట బ్యాటర్ల అవసరముంటుంది. ఈ ఫార్మాట్లో మీకు స్థిరపడటానికి తగినంత సమయం ఉండదు. తొలి బంతి నుంచే బౌలర్లపై దాడి కొనసాగించాల్సి ఉంటుందని' వెంగ్సర్కర్ చెప్పాడు.
టీ20 ప్రపంచకప్ భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్ , యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్దీప్ సింగ్.