టెస్టు క్రికెట్ చనిపోకూడదు:
'భారత్ తొలిసారి డే-నైట్ టెస్టు ఆడడం సంతోషంగా ఉంది. ఇది టెస్టు క్రికెట్కు ఎంతో మేలు చేస్తుంది. ప్రణాళిక ప్రకారం మార్కెటింగ్ చేస్తే డే-నైట్ టెస్టులు అభిమానులను తిరిగి స్టేడియాలకు రప్పిస్తాయి. టెస్టు క్రికెట్ ఎప్పటికీ చనిపోకూడదు. ఎందుకంటే టెస్టు క్రికెట్ మరణిస్తే.. క్రికెట్ చచ్చిపోయినట్టు. సుదీర్ఘ ఫార్మాట్ సమతుల ఆహారం లాంటిది. అదే లేకుంటే మన మనుగడే ఉండదు' అని జోషి అన్నారు.
ఫుట్వర్క్ పోగొట్టుకుంటున్నారు:
'ప్రస్తుతం టీ20 క్రికెట్లో చాలా మార్పులు జరుగుతున్నాయి. ఏదేదో జరుగుతోంది. అదే ఆలోచనా ధోరణి టెస్టుల్లోకి వస్తోంది. టీ20లు ఆడుతున్న ఆటగాళ్లు టెస్టు క్రికెట్లో ఫుట్వర్క్ పోగొట్టుకుంటున్నారు. అందుకే రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్, వీరేందర్ సెహ్వాగ్లు మళ్లీ కనిపించడం లేదు' అని దిలీప్ జోషీ పేర్కొన్నారు.
గొప్ప బ్యాట్స్మెన్ లేరు:
'ప్రస్తుత ఆటగాళ్లు ఫుట్వర్క్పై ఎక్కువగా దృష్టి పెట్టడం లేదు. బంతి బలంగా బాదేందుకు మాత్రమే చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆటగాళ్లు బ్యాటు వేగం, భుజ వేగంపై ఆధారపడుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో చాలా మంది ఇలానే ఉన్నారు. అందుకే జట్లు సొంతదేశాల్లో బాగా ఆడుతూ విదేశాల్లో విఫలమవుతున్నాయి. ప్రస్తుత ఆటగాళ్లలో బంతిని బలంగా బాదేవారున్నారు కానీ.. గొప్ప బ్యాట్స్మెన్ లేరు' అని జోషీ అభిప్రాయపడ్డారు.
బౌలింగ్ శైలి మార్చుకోవద్దు:
'గులాబి బంతికి అందరు అలవాటు పడాలి. దాంతో సాధన చేయాలి. ఎలా స్పిన్ చేయాలో దృష్టి పెట్టాలి. అంతకన్నా ఏమీ ఆలోచించొద్దు. బంతి తెలుపు, ఎరుపు, గులాబి ఏదైనా సరే.. బౌలింగ్ శైలి మార్చుకోవద్దు. ముఖ్యంగా స్పిన్నర్లు ప్రాథమిక అంశాల్లో మార్పులు చేసుకోవద్దు' అని జోషీ సూచించారు.