
హైదరాబాద్: డీఆర్ఎస్(నిర్ణయ సమీక్ష పద్ధతి) అడగడమంటే సవాల్ చేయడమే. ప్రత్యర్థిని ప్రశ్నిస్తున్నామంటే మనపై మనకు నమ్మకముండాలి. మ్యాచ్లో కెప్టెన్ అడగాలంటే అన్నీ చూసుకోవాలి. కానీ, కోహ్లీ ఇవేమీ పట్టించుకోడు. వికెట్ల వెనుక ఉన్న ధోనీ నిర్ణయమే శిరోధార్యం.
డీఆర్ఎస్ కోరడంలోనూ ధోనీ మార్క్ ఉంటుంది. అందుకే కెప్టెన్ విరాట్ కోహ్లి.. మ్యాచ్ ఎలాంటి స్థితిలో ఉన్నా ధోనీ సూచనలేనిదే వన్డే, టీ20ల్లో డీఆర్ఎస్ కోరడు. ఈ విషయం దక్షిణాఫ్రికాతో గత శనివారం రాత్రి ముగిసిన నాలుగో వన్డేలో మరోసారి నిరూపితమైంది.
ఈ మ్యాచ్లో ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో హసీమ్ ఆమ్లా బంతిని డిఫెన్స్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ.. బంతి అనూహ్యంగా టర్న్ తీసుకుని బ్యాట్కి అత్యంత సమీపం నుంచి వెనక్కి వెళ్లింది. దీంతో.. బంతి అందుకున్న ధోనీతో పాటు భారత ఫీల్డర్లు క్యాచ్ కోసం అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ ఆ అప్పీల్ని తిరస్కరించాడు.
అంపైర్ స్పందించకపోవడంతో బ్యాట్స్మన్కు దగ్గరగా ఉన్న రోహిత్ శర్మను క్లారిటీ కోసం సంప్రదించి సమీక్ష కోరేందుకు విరాట్ ఆసక్తి చూపించాడు. వెంటనే అప్రమత్తమైన ధోనీ సమీక్ష కోరవద్దని కోహ్లీకి సూచించాడు. కొద్దిసేపటికి రిప్లేలో చూడగా అది నాటౌట్ అని తేలింది. దీంతో ధోనీ చెప్పాడంటే అది కచ్చితంగా నిజమవుతుందని అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం వీడియో వైరల్గా మారింది.
వన్డేల్లో జట్టుకి ఒకే ఒక డీఆర్ఎస్ సౌలభ్యం ఇస్తుండటంతో.. వాటిని కోరేందుకు ఆటగాళ్లు సాహసించలేకపోతున్నారు. ముఖ్యంగా.. క్యాచ్ ఔట్ల విషయంలో వారికి ధైర్యం సరిపోదని చెప్పాలేమో..? కానీ.. మహేంద్రసింగ్ ధోనీ సహకారంతో విరాట్ కోహ్లి డీఆర్ఎస్ని మెరుగ్గా వినియోగించుకుంటున్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.