ధోనీకి తగ్గని క్రేజ్:
టెస్టులకు గుడ్బై చెప్పినా.. పరిమిత ఓవర్ల క్రికెట్కే పరిమితమైనా.. టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనిపై అభిమానం ఏమాత్రం తగ్గలేదు. ధోనిపై అభిమానంతో ఆదివారం ఉప్పల్ స్టేడియానికి అభిమానులు పోటెత్తారు. మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి స్టేడియంలో అభిమానుల సంఖ్య 23,778. అరగంటలోనే అభిమానుల సంఖ్య 30,888కు చేరుకుంది. కొద్దిసేపటికే ప్రేక్షకుల సంఖ్య 34,370కి పెరిగింది.
వాతావరణం కూడా తోడై:
స్టేడియం సింహభాగం పసుపు రంగు జెర్సీలతో నిండిపోయింది. ఉప్పల్ స్టేడియం సన్రైజర్స్ కంటే చెన్నైకే సొంతగడ్డలా అనిపించింది. గత కొన్ని రోజులుగా సూర్యప్రతాపం పెరిగిపోగా.. ప్రేక్షకుల కోసమా అన్నట్లు ఆదివారం వాతావరణం చల్లబడింది. సాయంత్రం 3 గంటల నుంచి ఉష్ణోగ్రత గణనీయంగా పడిపోయింది. 4.30 గంటల తర్వాత ఎండ వచ్చింది.
4 పరుగుల తేడాతో సన్రైజర్స్ను:
చెన్నై చెలరేగింది. ఉత్కంఠ పోరులో సన్రైజర్స్ను బోల్తాకొట్టించింది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో చెన్నై 4 పరుగుల తేడాతో సన్రైజర్స్ను ఓడించింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అంబటి రాయుడు, సురేశ్ రైనా 43 బంతుల్లో (54) నాటౌట్ అర్ధ సెంచరీలతో సత్తాచాటడంతో.. మొదట చెన్నై 20 ఓవర్లలో 3 వికెట్లకు 182 పరుగులు సాధించింది. ఆఖరి వరకు పోరాడిన సన్రైజర్స్ విజయానికి 5 పరుగుల దూరంలో నిలిచిపోయింది.
దీపక్ చాహర్ అద్భుతమైన బౌలింగ్తో (3/15):
18వ ఓవర్ జరుగుతోండగా అవుట్ అయిన రాయుడు తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ క్రీజులోకి వచ్చాడు. రైనాతో కలిసి చక్కని భాగస్వామ్యాన్ని అందించిన ధోనీ 12 బంతుల్లో 25 పరుగులు చేశాడు. ధోనీ, రైనాలు మ్యాచ్ చివర్లో ఉండగా ఇన్నింగ్స్కు చక్కని ముగింపు పలికారు. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు చేసింది. కెప్టెన్ విలియమ్సన్ 51 బంతుల్లో (84), యూసుఫ్ పఠాన్ 27 బంతుల్లో(45) పోరాడినా ఫలితం లేకపోయింది. పేసర్ దీపక్ చాహర్ (3/15) అద్భుతమైన బౌలింగ్తో సన్రైజర్స్కు మ్యాచ్ను దూరం చేశాడు.