న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తుంటాడు. తాను నవ్వడమే కాకుండా తన పక్క వాళ్లను కూడా తనదైన చేష్టలతో నవ్విస్తుంటాడు. చాలా ఫన్నీగా, జాలీగా గడుపుతుంటాడు. అయితే ఆ నవ్వు వెనుక ఉన్న రహస్యాన్ని అతని సతీమణి ధనశ్రీ వర్మ తాజాగా తెలిపింది. చాహల్కు క్రికెట్ అంటే పిచ్చని, అదే అతని ఫస్ట్ లవ్ అని, అందుకే అతను ఎప్పుడూ సంతోషంగా ఉంటాడని తెలిపింది. తనకంటే కూడా ఎక్కువగా క్రికెట్నే ప్రేమిస్తాడని చెప్పుకొచ్చింది. తాజాగా రాజస్థాన్ రాయల్స్ పొడ్కాస్ట్లో మాట్లాడిన ధనశ్రీ ఆసక్తికర విషయాలు పంచుకుంది.
'చాహల్ ఎప్పటికీ సంతోషంగా ఉండే వ్యక్తి. నిజం చెప్పాలంటే అతనికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. క్రికెట్ను నా కంటే పిచ్చిపిచ్చిగా ప్రేమిస్తాడు. అతని ఫస్ట్ లవ్ క్రికెట్. అందుకే అతను ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. చాహల్ ఎక్కడుంటే అక్కడ నవ్వులే. తన తోటి వాళ్లతో కూడా చాహల్ ఎంతో సరదాగా ఉంటాడు. మాములుగా డ్రెస్సింగ్ రూమ్లలోని వాతావరణం చాలా గంభీరంగా ఉంటుంది. చాలా మంది ఒత్తిడికి కూడా గురవుతారు. కానీ చాహల్ మాత్రం ఎప్పటికీ తన ముఖంపై చిరునవ్వు చెదరనివ్వడు. యూజీ.. యూజీలాగే ఉంటాడు..' అని చెప్పుకొచ్చింది.
అయితే తాను మాత్రం అతనికి విరుద్ధంగా ఉంటానని.. తన భావాలను కంట్రోల్ చేసుకోలేనని, అందుకే మ్యాచులు చూసేప్పుడు బిగ్గరగా అరవడం.. అతిగా స్పందించడం వంటివి చేస్తుంటానని తెలిపింది. 'ఐపీఎల్ మ్యాచులు చూసేవారందరికీ తెలుసు నేను కాస్త ఓవర్ ఎక్స్ప్రెసివ్ అని.. అవును. నేను ఆ రకమే. ఐపీఎల్ అయినా, టెస్టు, వన్డే అయినా మ్యాచులు చూడటానికి వచ్చే ప్రేక్షకులు కచ్చితంగా ఒత్తిడికి గురవుతారు. ఎందుకంటే వాళ్లు ఒక జట్టుకు మద్దతుగా నిలవాలి. మీ జట్టు భాగా ఆడాలని మీరు కోరుకుంటారు. నేనూ అదే చేస్తాను. వికెట్ తీసినా, సిక్సర్ కొట్టినా.. నేను ఓవర్ గానే రియాక్ట్ అవుతుంటా...' అని తెలిపింది.
ఐపీఎల్-15లో రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడిన చాహల్.. ఈ సీజన్ లో 17 మ్యాచుల్లో 27 వికెట్లు తీశాడు. లీగ్ మ్యాచుల సందర్భంగా కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో హ్యాట్రిక్ తో పాటు ఐదు వికెట్ల ప్రదర్శన కూడా చేశాడు. ఇక ఏడాదిన్నర క్రితం వివాహ బంధంతో యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ వర్మ ఒక్కటయ్యారు.