హైదరాబాద్: ఫిరోజ్ షా కోట్ల మైదానం జరుగుతున్న దేవధర్ ట్రోఫీ ఫైనల్లో ఇండియా-సి కెప్టెన్ అజ్యింకె రహానే సూపర్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇండియా-సి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా రహానే, ఇషాన్ కిషన్లు ఆరంభించారు.
వీరిద్దరూ తొలి వికెట్టుకు 210 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత ఇషాన్ పెవిలియన్కు చేరాడు. ఓపెనర్గా బరిలోకి దిగిన రహానే అజేయంగా 144 పరుగుల వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. 156 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో రహానే సెంచరీ సాధించాడు.
రహానేకు తోడుగా ఇషాన్ కిషన్(114; 87 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీ సాధించడంతో ఇండియా-సి జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల కోల్పోయి 352 పరుగులు చేసింది. అనంతరం క్రీజులోకి దిగిన శుబ్మాన్ గిల్(26), సూర్యకుమార్ యాదవ్(39), సురేశ్ రైనా(1), విజయ్ శంకర్(4)లు నిరాశపరిచారు.
ఈ మ్యాచ్లో రహానే చివరి వరకు క్రీజులో ఉండటం విశేషం. ఇండియా-బి బౌలర్లలో జయదేవ్ ఉనాద్కత్ మూడు వికెట్లు సాధించగా, దీపక్ చాహర్, మయాంక్ మార్కండేలకు తలో రెండు వికెట్లు లభించాయి.
టోర్నీలో వరుసగా రెండు మ్యాచ్ల్లో విఫలమైన రహానేని భారత్ టీ20 జట్టులోకి సెలక్టర్లు ఎంపిక చేయలేదు. వెస్టిండీస్తో టీ20 సిరీస్, ఆస్ట్రేలియాతో టీ20, టెస్టు సిరీస్ కోసం భారత జట్టుని సెలక్టర్లు ప్రకటించేసిన సంగతి తెలిసిందే. రహానేకు టెస్టు జట్టులో మాత్రమే చోటు దక్కింది.