భారతే మ్యాచ్ ఫిక్సింగ్లకు అడ్డా.. పాక్ మాజీ పేసర్ సంచలన ఆరోపణలు!!

కరాచీ: భారత్పై పాకిస్తాన్ మాజీ పేసర్ అకీబ్ జావెద్ సంచలన ఆరోపణలు చేశాడు. మ్యాచ్ ఫిక్సింగ్లకు భారతే భారీ అడ్డా అని పేర్కొన్నాడు. 1992లో ప్రపంచకప్ గెలిచిన ఇమ్రాన్ ఖాన్ జట్టులో అకీబ్ జావెద్ కూడా ఓ సభ్యుడు. అంతేకాదు 1990లలో పాకిస్తాన్ క్రికెట్లో జరిగిన అవినీతి కుంభకోణంలో ఇతగాడి పేరు కూడా వార్తల్లో నిలిచింది. అప్పట్లో మ్యాచ్ ఫిక్సింగ్కు వ్యతిరేకంగా మాట్లాడి అకీబ్ పెద్ద దుమారమే రేపాడు. ఆ తర్వాత జట్టులో స్థానం కోల్పోయాడు.

ఫిక్సింగ్లకు ఇండియానే అడ్డా
బుధవారం పాకిస్తాన్ టెలివిజన్ ఛానల్ జియో న్యూస్తో అకీబ్ జావెద్ మాట్లాడుతూ... 'భారత్లో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను గమనిస్తే.. భారత్లోనే ఫిక్సింగ్ మాఫియా ఉన్నట్లు తెలుస్తుంది. వారందరికీ భారత్ మంచి అడ్డా. ఇప్పటికే ఐపీఎల్లో కొందరు ఆటగాళ్లు ఫిక్సింగ్ బూతంలో ఇరుక్కున్నారు. ఒక్కసారి ఈ ఫిక్సింగ్ మాఫియాలోకి ఏ ఆటగాడైనా అడుగు పెట్టాడంటే.. అతడు తిరిగి వెనక్కు రావాలనుకున్నా రాలేడు' అని చెప్పాడు.

జీవితకాల నిషేధం విధించాలి:
'ఫిక్సింగ్కు పాల్పడిన ఆటగాళ్లు ఎంతోమంది శిక్షింపబడ్డారు. కానీ పై స్థాయిలో ఉన్న వారు కానీ, ఫిక్సింగ్ మాఫియాను కానీ ఏమీ చేయలేకపోతున్నారు. క్రికెట్ బోర్డులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని నా మనవి. ఫిక్సింగ్కు పాల్పడిన ఆటగాళ్లను ఏ మాత్రం ఉపేక్షించకుండా జీవితకాల నిషేధం విధించాలి. ఫిక్సింగ్కు పాల్పడిన మహ్మద్ ఆమిర్ లాంటి ఆటగాళ్లకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తిరిగి జట్టులో అవకాశం కల్పించడం బాధాకరం. దీనివల్ల మరింతమంది ఫిక్సింగ్కు పాల్పడే అవకాశం ఉంటుంది' అని అకీబ్ జావెద్ అన్నాడు.

చంపేస్తామంటూ బెదిరించారు:
'1992లో ప్రపంచకప్ జట్టులో భాగస్వామిగా ఉన్న నేను క్రికెట్ నుంచి కనుమరుగవ్వడానికి అసలు కారణం ఫిక్సింగ్ను వ్యతిరేకించడమే. నేను 1990లో ఫిక్సింగ్కు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఎంతోమంది చంపేస్తామంటూ బెదిరించారు. తమ పేర్లు బయటపెడితే ముక్కలు ముక్కలుగా నరికేస్తామని హెచ్చరించారు. ఎంతో బయపడిపోయా. అప్పటి నుంచే నా కెరీర్ పతనమైంది. పాక్ జట్టులో మళ్లీ స్థానం సంపాదించుకోలేకపోయా' అని అకీబ్ పేర్కొన్నాడు. అకీబ్ పాక్ తరఫున 22 టెస్టులు, 163 వన్డేలు ఆడాడు.

పునరాగమనం చేసే అవకాశం రాలేదు:
నా కంటే ముందు ఫిక్సింగ్ చేసిన వాళ్లు ఉన్నారు.. నాతో పాటు ఫిక్సింగ్ చేసిన వారు ఉన్నారు.. నా తర్వాత చేసిన వాళ్లు ఉన్నారు అని పాకిస్తాన్ వెటరన్ పేసర్ మహ్మద్ అసిఫ్ ఇటీవలే అన్నాడు. అప్పట్లో మహ్మద్ అసిఫ్పై ఉన్న ఏడేళ్ల నిషేధాన్ని ఐదేళ్లకు తగ్గించినా.. ఆ తర్వాత అతనికి పాక్ జట్టులో పునరాగమనం చేసే అవకాశం మాత్రం రాలేదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఫిక్సింగ్కు పాల్పడిన క్రికెటర్లలో కొంతమందికి తిరిగి జాతీయ జట్టులో ఆడే అవకాశం ఇచ్చినా.. తనకు మాత్రం రెండో చాన్స్ ఇవ్వలేదని అసిఫ్ ఆవేదన వ్యక్తం చేసాడు. తన సహచర బౌలర్ మహ్మద్ అమిర్ కూడా ఫిక్సింగ్లో ఇరుక్కొన్నప్పటికీ మళ్లీ రీఎంట్రీ ఇవ్వడాన్ని అసిఫ్ పరోక్షంగా ప్రస్తావించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications