ఐపీఎల్-12లో భాగంగా బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఆర్సీబీ నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యంను 18.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 67 (50 బంతుల్లో 8x4, 2x6) అర్ధశతకం చేసి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. తాజా ఓటమితో బెంగళూరు వరుసగా ఆరో ఓటమిని చవి చూసింది. దీంతో బెంగళూరు టోర్నీ నుండి నిష్క్రమించే అవకాశాలు ఎక్కువ అయ్యాయి.
వరుసగా ఐదు ఫోర్లు:
150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ శిఖర్ ధావన్ ఇన్నింగ్స్ మూడో బంతికే డకౌట్ అయ్యాడు. సౌథీ బౌలింగ్లో షాట్కు ప్రయత్నించి నవదీప్ సైనీ చేతికి చిక్కాడు. అయితే సౌధీ వేసిన మూడో ఓవర్లో మరో ఓపెనర్ పృథ్వీషా 28(22 బంతుల్లో 5x4), వరుసగా ఐదు ఫోర్లు కొట్టడంతో.. డిల్లీ 3 ఓవర్లు పూర్తయ్యేసరికి 30 పరుగులు చేసింది. ఇదే ఊపులో పృథ్వీషా పెవిలియన్ చేరాడు.
కెప్టెన్ ఇన్నింగ్స్:
పృథ్వీషా అవుట్ అయిన అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ బాధ్యతను తీసుకున్నాడు. కొలిన్ ఇంగ్రామ్ (22)తో కలిసి స్కోరు బోర్డును పరుగెత్తించాడు. ఇంగ్రామ్ ఔటయ్యాక రిషభ్ పంత్ (18) సహకారంతో అర్ధ శతకంపూర్తి చేసాడు. అయితే రెండు పరుగుల వ్యవధిలో అయ్యర్, మోరిస్, పంత్లు అవుట్ అయ్యారు. చివరలో అక్షర్ పటేల్ బౌండరీ బాది ఢిల్లీకి విజయాన్ని అందించాడు. ఢిల్లీ బౌలర్ నవదీప్ సైనీ 2 వికెట్లు తీసాడు. అంతకుముందు కెప్టెన్ విరాట్ కోహ్లీ 41(33 బంతుల్లో 1x4, 2x6) పోరాడి.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది.