
కోల్కతా: ఇటీవల ముగిసిన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో హర్మన్ప్రీత్ సేన తుది పోరులో బోల్తాపడ్డ విషయం తెలిసిందే. మన అమ్మాయిలు మాత్రం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా యువ సంచలనం షెఫాలీ వర్మ, సీనియర్ స్పిన్నర్ పూనమ్ యాదవ్, యువ స్పిన్నర్ దీప్తిశర్మ. ప్రపంచకప్లో చాలా పొదుపుగా బౌలింగ్ చేసిన దీప్తిశర్మను పశ్చిమ్ బంగాల్ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ఈ విషయాన్ని ఆమె ట్విటర్ ద్వారా తెలియజేసింది.
ఈ సందర్భంగా తనను సత్కరించిన మాజీ క్రికెటర్ లక్ష్మి రతన్ శుక్లాతో పాటు ఆ రాష్ట్ర యువజన సేవలు, క్రీడా శాఖ మంత్రి అరుప్ బిస్వాస్కు దీప్తిశర్మ ధన్యవాదాలు చెప్పింది. మెగా టోర్నీలో ఆస్ట్రేలియాతో తలపడిన ఆరంభ మ్యాచ్లో దీప్తి తన కోటా నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 17 పరుగులు ఇచ్చింది. ఇక శ్రీలంకతో మ్యాచ్లో ఒక వికెట్ తీయడంతో పాటు 16 పరుగులు చేసింది. లీగ్ దశలో దీప్తి అద్భుతంగా రాణించింది.
భారత్ గ్రూప్ దశలో అన్ని మ్యాచ్లు గెలుపొందివిషయం తెలిసిందే. నాలుగు మ్యాచ్లు గెలిచి సెమీస్ చేరుకోగా.. ఇంగ్లాండ్తో ఆడాల్సిన సెమీఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన హర్మన్ప్రీత్ సేన ఆ మ్యాచ్ ఆడకుండానే ఫైనల్ చేరింది. ఇక ఆస్ట్రేలియాతో పోటీపడ్డ ఫైనల్ మ్యాచ్లో 85 పరుగులతో ఓటమిపాలై రన్నరప్గా నిలిచింది.
ఫైనల్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 184 పరుగులు చేసింది. ఓపెనర్లు ఎలీసా హేలీ (39 బంతుల్లో 75; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), బెత్ మూనీ (54 బంతుల్లో 78 నాటౌట్; 10 ఫోర్లు) చితకొట్టారు. భారత బౌలర్లలో పూనమ్ యాదవ్ (1/30) పెద్దగా ప్రభావం చూపలేకపోగా.. దీప్తి శర్మ (2/38) ఫర్వాలేదనిపించింది. అనంతరం లక్ష్య ఛేనలో భారత్ 19.1 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌటైంది. దీప్తి శర్మ (33; 2 ఫోర్లు) టాప్ స్కారర్. ఆసీస్ బౌలర్లలో మేఘన్ షుట్ (4/18), జెస్ జొనాసెన్ (3/20) రాణించారు.
మ్యాచ్ అనంతరం కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ మాట్లాడుతూ... 'ప్రపంచకప్లో మా జట్టు ఆటతీరుపై పూర్తిస్థాయిలో సంతృప్తిగా ఉన్నా. లీగ్ దశలో అన్ని మ్యాచుల్లోనూ బాగా ఆడాం. కీలకమైన ఫైనల్లో మాత్రం ఓడిపోయాం. ఇది చాలా బాధకరం. కీలకమైన మ్యాచ్లో క్యాచ్లు జారవిడిచాం. అయితే ప్రస్తుతం ఉన్న జట్టుపై ఎంతో నమ్మకం ఉంది. రానున్న ఆరు నెలల కాలం మాకు ఎంతో కీలకం. ఆటలో గెలుపోటములు సహజం. కొన్నిసార్లు విజయం సాధిస్తే.. మరికొన్ని సార్లు ఓటమి చవిచూడాల్సి వస్తుంది. అనుభవాల నుంచి ఎంతో నేర్చుకోవాలి' అని అన్నారు.