హైదరాబాద్: భారత జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ డీన్ జోన్స్ అభిప్రాయపడ్డాడు. సెప్టెంబర్ 15 నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరగనున్న ఆసియా కప్ కోసం శనివారం ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని భారత సెలక్టర్లు జట్టుని ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే, రాబోయే సిరిస్లను దృష్టిలో పెట్టుకుని కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఆసియా కప్ టోర్నీ నుంచి విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో దాయాది దేశమైన పాకిస్థాన్తో భారత జట్టు రెండు లేదా మూడు సార్లు తలపడే అవకాశం ఉండటంతో కోహ్లీ లేని టీమిండియా ఎలా ఆడుతుందోననే అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఆసియా కప్ తర్వాత భారత జట్టు వెస్టిండీస్, ఆస్ట్రేలియాతో సుదీర్ఘ సిరీస్లు ఆడనున్న నేపథ్యంలోనే విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చామని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించారు. అయితే, కోహ్లీ జట్టులో లేకపోయినా ఆసియా కప్లో భారత్ జట్టు మెరుగైన ప్రదర్శన చేస్తుందని డీన్ జోన్స్ ధీమా వ్యక్తం చేశాడు.
"భారత జట్టులో కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే క్రికెటర్ లేడు. టీమిండియా అంటే ఒక్కరే (కోహ్లీ) కాదు. దొరికిన అవకాశాన్ని మనీశ్ పాండే, అంబటి రాయుడు చక్కగా వినియోగించుకోవాలి. రోహిత్ శర్మ కెప్టెన్సీలోని జట్టు బలంగా కనిపిస్తోంది. రివర్స్ స్వింగ్ రాబట్టే బౌలర్లు ఉన్నారు. 25-30 ఓవర్లు వేయగలిగే స్పిన్నర్లూ జట్టులో ఉన్నారు. ధోని జట్టులో ఉన్నాడనే విషయం మర్చిపోవద్దు" అని డీన్ జోన్స్ సూచించాడు.