దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో కింగ్స్ పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ పిచ్ కూడా స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో టాస్ నెగ్గిన పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫీల్డింగ్కే మొగ్గు చూపాడు. అయితే తొలి మ్యాచ్లో వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్కు నిరాశే ఎదురైంది. పంజాబ్ తుది జట్టులో అతనికి చోటు దక్కలేదు.
షెల్డన్ కాట్రెల్, మ్యాక్స్ వెల్, నికోలస్ పూరన్, క్రిస్ జోర్డాన్లతో విదేశీ ఆటగాళ్ల కోటా పూర్తవడంతో యూనివర్సల్ బాస్ బెంచ్కే పరిమితమయ్యాడు. అండర్-19 క్రికెటర్ రవి బిష్ణోయ్ ఈ మ్యాచ్తో ఐపీఎల్లోకి అరంగేట్రం చేశాడు. ఢిల్లీ జట్టు ఫారిన్ కోటాలో కగిసో రబాడ, అన్రిచ్ నోర్జ్, మార్కస్ స్టోయినిస్, షిమ్రన్ హెట్మైర్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. సీనియర్ బ్యాట్స్మన్ అజింక్యా రహానేకు చోటు దక్కలేదు.
ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్ అందుకోని ఈ రెండు జట్లు.. విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. కొత్త కోచ్ అనిల్ కుంబ్లే, నూతన కెప్టెన్ కేఎల్ రాహుల్తో సరికొత్తగా బరిలోకి దిగుతున్న కింగ్స్ పంజాబ్.. యువ ఆటగాళ్లతో నిండిన శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ విజయంతో తమ ఐపీఎల్ 2020 జర్నీని ప్రారంభించాలని తహతహలాడుతున్నాయి.
గత సీజన్లో రెండు సార్లు తలపడిన ఇరు జట్లు.. చెరో మ్యాచ్లో గెలుపొంది సమంగా ఉన్నాయి. ఇక ఓవరాల్గా ఐపీఎల్లో ఇప్పటి వరకు 24 సార్లు తలపడగా.. 10 మ్యాచుల్లో ఢిల్లీ, 14 మ్యాచుల్లో పంజాబ్ గెలిచింది. మొత్తంగా ఢిల్లీపై పంజాబ్ ఆధిపత్యం కనబర్చింది. అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది.
తుది జట్లు :
ఢిల్లీ: పృథ్వీ షా, శిఖర్ ధావన్, షిమ్రాన్ హెట్మైర్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), రిషభ్ పంత్(కీపర్), మార్కస్ స్టోయినిస్, అక్సర్ పటేల్, అశ్విన్, కగిసో రబడా, అన్రిచ్ నోర్జ్, మోహిత్ శర్మ
పంజాబ్: కేఎల్ రాహుల్(కీపర్/కెప్టెన్), మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్, నికోలస్ పూరన్, గ్లెన్ మ్యాక్స్వెల్, కృష్ణప్ప గౌతమ్, షెల్డన్ కాట్రెల్, క్రిస్ జోర్డాన్, మహ్మద్ షమీ, రవి బిష్ణోయ్
అంబటి రాయుడిని కించపర్చిన సంజయ్ మంజ్రేకర్.. మండిపడుతున్న ఫ్యాన్స్!