ముంబై: ఐపీఎల్ 2022 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ మరో విజయాన్నందుకుంది. కోల్కతా నైట్రైడర్స్తో గురువారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన ఢిల్లీ.. 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు మాత్రమే చేసింది. నితీష్ రాణా (34 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 57), శ్రేయస్ అయ్యర్(37 బంతుల్లో 4 ఫోర్లతో 42) రాణించారు. కుల్దీప్ యాదవ్(4/14), ముస్తాఫిజుర్ రెహ్మాన్ (3/18) కేకేఆర్ పతనాన్ని శాసించగా.. చేతన్ సకారియా, అక్షర్ పటేల్కు ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం ఢిల్లీ 19 ఓవర్లలో 6 వికెట్లకు 150 పరుగులు చేసి గెలుపొందింది. డేవిడ్ వార్నర్(26 బంతుల్లో 8 ఫోర్లతో 42), రోవ్మెన్ పొవెల్(33 నాటౌట్) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు తీయగా.. హృతీష్ రాణా, నరైన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ ఓటమితో కేకేఆర్ తమ ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
147 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్కు ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్కే గట్టి షాక్ తగిలింది. పృథ్వీ షా(0) ఇచ్చిన రిటర్న్ క్యాచ్ను ఉమేశ్ యాదవ్ సూపర్ డైవ్తో అందుకున్నాడు. ఆ వెంటనే హర్షిత్ రాణా వేసిన మూడో ఓవర్లో మిచెల్ మార్ష్(13) క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన లలిత్ యాదవ్(22)తో కలిసి డేవిడ్ వార్నర్ బౌండరీలు బాదడంతో ఢిల్లీ పవర్ ప్లేలో 2 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. ఆ తర్వాత కూడా ఈ జోడీ జోరు కనబర్చగా.. ఉమేశ్ యాదవ్ విడదీసాడు.
డేవిడ్ వార్నర్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చి మూడో వికెట్కు నమోదైన 65 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే నరైన్.. లలిత్ యాదవ్ను ఔట్ చేయగా.. రిషభ్ పంత్ను ఉమేశ్ యాదవ్ పెవిలియన్ చేర్చాడు. 2 పరుగుల వ్యవధిలోనే ఢిల్లీ మూడు వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో అక్షర్ పటేల్ 2 ఫోర్లు, సిక్సర్తో జోరు కనబర్చాడు. అయితే రోవ్మన్ పొవెల్తో సమన్వయ లోపం కారణంగా అక్షర్ పటేల్ రనౌటయ్యాడు. అయితే క్రీజులోకి వచ్చిన శార్దూల్ ఠాకూర్(8 నాటౌట్)తో కలిసి రోవ్మన్ పొవెల్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.