
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్) మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్లో నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. కేకేఆర్ ఓపెనర్ అజింక్యా రహానే ఏకంగా 9 సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇందుల్లో కొన్ని అంపైర్ తప్పుడు నిర్ణయాలు ఉండగా.. ఇంకొన్ని ప్రత్యర్థి జట్టు తప్పిదాలు ఉన్నాయి. ముస్తాఫిజుర్ రెహ్మాన్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ తొలి బంతికే రహానే కీపర్ క్యాచ్గా ఔటవ్వగా.. రివ్యూతో బతికిపోయాడు. రెండో బంతికి ఎల్బీగా ఔటవ్వగా.. మళ్లీ రివ్యూతో గట్టెక్కాడు.
అయితే ఆ ఓవర్ మూడో బంతి రహానే బ్యాట్ ఎడ్జ్ తీసుకొని కీపర్ చేతిలో పడగా.. ఎవరూ అప్పీల్ చేయలేదు. అంపైర్ కూడా పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత రిప్లేలో బంతి బ్యాట్ను తాకి పంత్ చేతిలో పడినట్లుగా తేలింది. ఠాకూర్ వేసిన రెండో ఓవర్ చివరి బంతికి కూడా రహానే వికెట్ల ముందు దొరకగా.. అంపైర్ నాటౌటిచ్చాడు.
ఖలీల్ అహ్మద్ వేసిన మూడో ఓవర్ తొలి బంతికి రహానే రనౌటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకోగా.. వెకంటేశ్ అయ్యర్ క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఠాకూర్ వేసిన నాలుగో ఓవర్ ఐదో బంతికి కూడా క్యాచ్ ఔటయ్యే ప్రమాదం నుంచి గట్టెక్కాడు. ఐదో ఓవర్ తొలి బంతికి రహానే ఇచ్చిన రిటర్న్ క్యాచ్ను ఖలీల్ అందుకోలేకపోయాడు. కానీ ఆ ఓవర్ నాలుగో బంతికి క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ఇన్ని లైఫ్స్ లభించినా రహానే వినియోగించుకోకపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ మ్యాచ్లో సమష్టిగా రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్ 44 పరుగుల తేడాతో కేకేఆర్ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 215 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్(45 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 61), పృథ్వీ షా(29 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 51) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. రిషభ్ పంత్(14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 27), అక్షర్ పటేల్(14 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 22 నాటౌట్), శార్దూల్ ఠాకూర్(11 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 29 నాటౌట్) మెరుపులు మెరిపించారు. కేకేఆర్ బౌలర్లలో నరైన్ 2 వికెట్లు తీయగా.. ఉమేశ్ యాదవ్, రస్సెల్, వరుణ్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం కేకేఆర్ 19.4 ఓవర్లలో 171 పరుగులకు కుప్పకూలింది. శ్రేయస్ అయ్యర్(33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 54), నితీశ్ రాణా(20 బంతుల్లో 3 సిక్స్లతో 30) రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో చెలరేగగా..శార్దూల్ ఠాకూర్ రెండు, ఖలీల్ అహ్మద్ మూడు వికెట్లు తీశారు. లలిత్ యాదవ్కు ఓ వికెట్ దక్కింది.