|
హోల్కర్ స్టేడియం ఫ్లడ్లైట్ల వెలుతురులో ప్రాక్టీస్
ఇండోర్ వేదికగా ఐదు రోజులు జరగాల్సిన తొలి టెస్టు మొదటి మూడు రోజులకే ముగియడంతో మిగిలిన రెండు రోజులు ఇండోర్లోని హోల్కర్ స్టేడియం ఫ్లడ్లైట్ల వెలుతురులోనే టీమిండియా ప్రాక్టీస్ చేసింది. హెడ్ కోచ్ రవిశాస్త్రి, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్లు జట్టుతోనే ఉన్నారు. చారిత్రాత్మక డే/నైట్ టెస్టు కోసం రెండు జట్లు మంగళవారం కోల్కతాకు చేరుకోనున్నాయి. భారత్ తొలిసారి డే/నైట్ టెస్టుకు ఆతిథ్యమిస్తోండటంతో దీనిని నిర్వహణను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీసీసీఐ అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చేస్తోంది.
పింక్ బాల్ టెస్ట్ కోసం ప్రత్యేకంగా పింకు-టింకు అనే మస్కట్
పింక్ బాల్ టెస్ట్ కోసం ప్రత్యేకంగా పింకు-టింకు అనే మస్కట్ను రూపొందించింది. పింక్ బాల్ టెస్ట్ కోసం కోల్కతాళోని వీధులన్నీ గులాబీ మయం అయ్యాయి. నగరంలోని చరిత్రాత్మక కట్టడాలకు గులాబీ కాంతులతో మెరిసేలా చేశారు. ఈ పింక్ బాల్ టెస్ట్కు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మ్యాచ్కు రానున్నారు. తొలిరోజు వీరిద్దరూ గంటను మోగించి ఆటను ప్రారంభించనున్నారు. ఇప్పటికే తొలి మూడు రోజుల టికెట్లు మొత్తం అమ్ముడు పోయాయని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడంటే ఈ మ్యాచ్కు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
పింక్ బాల్ టెస్టుల్లో ఆస్ట్రేలియాదే ఆధిపత్యం
టెస్టులకు ఆదరణ పెంచడం కోసం డే/నైట్ టెస్టు ఆలోచన వచ్చింది. 2015లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి డే/నైట్ టెస్టు జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 11 డే/నైట్ టెస్టులు జరిగాయి. ఇప్పటివరకు పింక్ బాల్ టెస్ట్లో ఆస్ట్రేలియా అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. ఎందుకంటే ప్లడ్ల లైట్ల కింద ఆడిన ఐదు మ్యాచ్ల్లోనూ విజయం సాధించింది. 2015, నవంబరు 27 నుంచి డిసెంబర్ 1 వరకు అడిలైడ్లో జరిగిన తొలి డే/నైట్ టెస్టులో ఆస్ట్రేలియా మూడు వికెట్లతో విజయం సాధంచింది. ఇదే వేదికపై దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్పై కూడా విజయం సాధించింది. బ్రిస్బేన్లో 2016లో పాకిస్థాన్పై 39 పరుగుల తేడాతో గెలవగా.. ఈ ఏడాది శ్రీలంకపై ఇన్నింగ్స్ 40 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆసీస్ తర్వాత అత్యంత విజయవంతమైన జట్టుగా శ్రీలంక మూడింట రెండు విజయాలతో ఉంది. విండిస్ చెత్త రికార్డును కలిగి ఉంది. వెస్టిండిస్ ఆడిన మూడు పింక్ బాల్ టెస్టుల్లోనూ ఓడిపోయింది.
అజర్ అలీ ట్రిపుల్ సెంచరీ
డే/నైట్ టెస్టుల్లో బ్యాటింగ్ రికార్డుల్లో పాక్ ఆధిపత్యం చెలాయిస్తుంది. పాక్కు చెందిన అజార్ అలీ 6 ఇన్నింగ్స్లలో 91 సగటుతో 456 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఫ్లడ్లైట్ల వెలుతురులో ట్రిపుల్ సెంచరీ చేసిన ఏకైక క్రికెటర్ కూడా అతనే కావడం విశేషం. అలాగే పాక్ బ్యాట్స్మన్ అసద్ షఫీక్ అత్యధికంగా రెండు సెంచరీలు కొట్టిన బ్యాట్స్మన్గా నిలిచాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ స్మిత్ 4 టెస్టులలో 50.62 సగటుతో 405 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
అగ్రస్థానంలో మిచెల్ స్టార్క్
బౌలింగ్లో ఆస్ట్రేలియాకు చెందిన లెఫ్ట్ ఆర్మ్ సీమర్ మిచెల్ స్టార్క్ డే-నైట్ టెస్టుల్లో అత్యంత విజయవంతమైన బౌలర్గా నిలిచాడు. ఐదు టెస్టుల్లో ఏకంగా 26 వికెట్లు తీశాడు. ఇందులో ఓసారి ఐదు వికెట్లను సాధించాడు. మరో ఆసీస్ పేసర్ జోష్ హాజెల్వుడ్ నాలుగు టెస్టుల్లో 22.42 సగటుతో 21 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. వెస్టిండీస్ లెగ్ స్పిన్నర్ దేవేంద్ర బిషూ డే-నైట్ టెస్టుల్లో ఇన్నింగ్స్లో అత్యుత్తమ వ్యక్తిగత బౌలింగ్ గణాంకాలు సాధించిన రికార్డును కలిగి ఉన్నాడు. 2016 అక్టోబరులో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో అతడు 13.5 ఓవర్లలో 49 పరుగులిచ్చి 8 వికెట్లతో ఆకట్టుకున్నాడు. 2019 జనవరిలో బ్రిస్బేన్లో శ్రీలంకపై పాట్ కమ్మిన్స్ 23 వికెట్లకు 6 వికెట్లు పడగొట్టాడు.