
హైదరాబాద్: బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో ఏడాది పాటు నిషేధానికి గురైన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్లెడ్జింగ్ కారణంగా మరోసారి అసహనానికి గురయ్యాడు. ప్రత్యర్థి ఆటగాళ్లు స్లెడ్జింగ్కు దిగడంతో డేవిడ్ వార్నర్ ఆట మధ్యలోనే మైదానం నుంచి వెళ్లి పోయాడు. సిడ్నీ గ్రేడ్ గేమ్లో భాగంగా శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ ఏడాది మార్చిలో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న వార్నర్ ఏడాదిపాటు నిషేధం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీంతో క్లబ్లు, దేశవాళీ జట్ల తరఫున డేవిడ్ వార్నర్ బరిలో దిగుతున్నాడు. తాజాగా సిడ్నీగ్రేడ్ మ్యాచ్లో ప్రత్యర్థి ఆటగాళ్లు స్లెడ్జింగ్ పాల్పడటంతో చికాకు గురైన వార్నర్ అసహనంతో మ్యాచ్ మధ్యలోనే వెళ్లిపోయాడు.
స్లెడ్జింగ్ జరిగిన సమయంలో వార్నర్ ర్యాండ్విక్-పీటర్శామ్ జట్టు తరఫున బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్రత్యర్థి ఆటగాడొకరు పదే పదే స్లెడ్జింగ్ చేయడంతో.. ఆట నుంచి తనకు తానుగా వైదొలుగుతున్నట్టుగా వార్నర్ అంపైర్కి చెప్పాడు. జట్టు సభ్యులు బుజ్జగించడంతో.. కాసేపటి తర్వాత క్రీజులోకి వచ్చిన వార్నర్ సెంచరీ సాధించాడు.
వార్నర్పై స్లెడ్జింగ్కు పాల్పడింది గతంలో బంతి తగిలి మరణించిన ఫిలిఫ్ హ్యూస్ సోదరుడు జాసన్ హ్యూస్గా ఆసీస్ మీడియా గుర్తించింది. అతడు డేవిడ్ వార్నర్ను అవమానించడంతో... అసహనం వ్యక్తం చేసిన వార్నర్ ఏం మాట్లాడకుండా మైదానం వీడాడని ఆసీస్ మీడియా తన కథనాల్లో రాసుకొచ్చింది.
క్రికెట్లో రూల్ ప్రకారం రిటైర్ట్ హర్ట్గానే బ్యాట్స్మెన్ పిచ్ను వదలాలి. కానీ ఈ విషయంలో వెస్ట్రన్ సబర్బ్స్ ఆటగాళ్లు ఉదారంగా వ్యవహరించడంతో.. వార్నర్ తిరిగి మైదానంలోకి వచ్చి సెంచరీ చేయగలిగాడు. మరోవైపు వార్నర్ మైదానాన్ని వదిలి వెళ్లడం పట్ల క్రికెట్ అభిమానుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కొందరు వార్నర్ను తప్పుబట్టగా, మరికొందరు మాత్రం అతడికి అండగా నిలిచారు.