
సిడ్నీ: ఐపీఎల్ 2021 సీజన్లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు వీడనున్నాడనే పుకార్లు షికార్ చేస్తున్నాయి. విలియమ్సన్ ట్రేడింగ్ ద్వారా చెన్నై సూపర్ కింగ్స్కు మారుతాడని ఐపీఎల్ 2020 సీజన్ ముగిసినప్పటి నుంచి జరుగుతుంది. కానీ కేన్ మామ ఎక్కడికి పోడని, అతన్ని అంటిపెట్టుకోవడానికి ఉన్నా అవకాశాలన్ని ఉపయోగిస్తామని ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఇప్పటికే స్పష్టం చేశాడు.
అయినా ఈ పుకార్లు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా విలియమ్సన్ ఐపీఎల్లో ఇంకో జట్టులోకి వెళ్తున్నాడా? ఇది నిజమేనా? దీనిపై క్లారిటీ ఇవ్వాలని ఓ నెటిజన్ వార్నర్ను ట్విటర్ వేదికగా ప్రశ్నించాడు. 'ఈ విషయాన్ని నేను ఇప్పుడే వింటున్నా. కేన్ ఎక్కడికీ వెళ్లడు'అంటూ వార్నర్ క్లారిటీచ్చాడు. ఆరెంజ్ ఆర్మీలో కేన్ విలియమ్సన్ కీలక ఆటగాడు. వార్నర్ గైర్హాజరీలో రెండేళ్లు జట్టును లీడ్ చేసిన ఈ కివీస్ ప్లేయర్ ఓ సారి ఫైనల్కు మరోసారి ఫ్లే ఆఫ్స్కు చేర్చాడు. ఈ రెండు సీజన్లలో జట్టు బ్యాటింగ్ బాధ్యతలను తన భుజాలపై మోసాడు. ఈ సీజన్లో కూడా కేన్ మామ ఆకట్టుకున్నాడు. గాయంతో ఆరంభ మ్యాచ్లకు దూరమైన.. ఆ తర్వాత 12 మ్యాచ్ల్లో 133.75 స్ట్రైక్ రేట్తో 317 రన్స్ చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన క్వాలిఫయర్-2లో అతను కనబర్చిన పోరాటపటిమ ఈ సీజన్కే హైలైట్. కానీ దురదృష్టవశాత్తు హైదరాబాద్ విజయాన్నందుకోలేకపోయింది.