లంక ఆటగాళ్లపై ఉగ్రదాడి:
2009లో పాక్లో టెస్ట్ సిరీస్ ఆడటానికి శ్రీలంక జట్టు లాహోర్కు వచ్చింది. లంక ఆటగాళ్లు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రదాడి జరగడంతో ఆరుగురు పాక్ పోలీసులు, ఇద్దరు పౌరులు చనిపోయారు. అయితే శ్రీలంక జట్టు సభ్యులకు ఏమీ కాలేదు. కొంతమందికి మాత్రం గాయాలయ్యాయి. అప్పటి నుండి ఏ జట్టు కూడా పాకిస్థాన్లో ఆడలేదు. భద్రతా కారణాలతో అంతర్జాతీయ క్రికెటర్లందరూ నిరాకరిస్తున్న వేళ డారెన్ సామీ ధైర్యం చేసి 2017లో పాక్ గడ్డపై పీఎస్ఎల్ ఫైనల్ ఆడాడు.
సామీ తొలి అడుగు:
తమ దేశంలో అంతర్జాతీయ క్రికెట్కు పునరుజ్జీవం కల్పించేందుకు పాకిస్థాన్ ఎంతగానో కృషి చేస్తోంది. డారెన్ సామీ తొలి అడుగు వేయగా.. అనేక చర్చల అనంతరం ఇటీవలే లంక, బంగ్లాదేశ్ పాక్ గడ్డపై పర్యటించిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్లో పెషావర్ జల్మి జట్టుకు సామీ సారథ్యం వహిస్తున్నాడు. పాక్ క్రికెట్ పునర్వైభవం కోసం సామీ చేసిన సహాయానికి కృతజ్ఞతగా పాక్ ప్రభుత్వం ఆ దేశ గౌరవ పౌరసత్వం కల్పించనుంది.
సామీకి పాక్ పౌరసత్వం:
పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి మార్చి 23న డారెన్ సామీకి ఆ దేశ గౌరవ సభ్యత్వం ఇవ్వనున్నారు. అంతేకాదు పాకిస్థాన్ దేశ అత్యున్నత పౌర పురస్కారం 'నిషాన్ ఇ హైదర్'ను అందించనున్నారు. పాకిస్థాన్ క్రికెట్కు సామీ చేసిన సహాయానికి కృతజ్ఞతగా అతడికి గౌరవ పౌరసత్వం అందించాలని తాము అధ్యక్షుడికి విజ్ఞప్తి చేశామని పెషావర్ జల్మి జట్టు యాజమాని జావెద్ అఫ్రిది అన్నారు.
మూడో క్రికెటర్ సామీనే:
2007 వన్డే ప్రపంచకప్ తర్వాత ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హెడేన్, దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్ హర్షల్ గిబ్స్కు సెయింట్ కీట్స్ గౌరవ పౌరసత్వం పాక్ అందించింది. ఆ తర్వాత ఇలాంటి ఘనత అందుకుంటున్న మూడో క్రికెటర్ డారెన్ సామీనే కావడం విశేషం. దీంతో సామీ పాకిస్థాన్లోనూ ప్రముఖుడు అయ్యాడు.
సామీ కెప్టెన్సీలో రెండు వరల్డ్కప్లు:
2004లో విండీస్ తరఫున అరంగ్రేటం చేసిన సామీ ఆ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. డారెన్ సామీ కెప్టెన్సీలో విండీస్ జట్టు రెండుసార్లు టీ20 వరల్డ్కప్ సొంతం చేసుకుంది. విండీస్ తరఫున 38 టెస్టుల్లో, 126 వన్డేల్లో, 68 టీ20ల్లో ప్రాతినిథ్యం వహించిన సామీ.. 2017 సెప్టెంబర్లో చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. విండీస్ బోర్డుతో విభేదాల నేపథ్యంలో చాలా కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో విదేశీ లీగ్ల్లో ఆడుతూ సత్తాచాటుతున్నాడు.