టాస్ గెలవకపోవడం..
తీవ్ర ఒత్తిడికి గురైన భారత బ్యాటర్లు వరుసగా వికెట్లు చేజార్చుకున్నారు. ఒత్తిడిని తట్టుకొని క్రీజులో నిలబడినా భారత్ గెలిచేది. అయితే ఈ మ్యాచ్లో టాస్ ఓడిపోవడం టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. భారత్ బలహీనతపై దెబ్బకొట్టింది. నాకౌట్ మ్యాచ్ల్లో భారత అమ్మాయిలు చేజింగ్ చేయలేరని భావించి తెలివిగా బ్యాటింగ్ ఎంచుకుంది. భారీ స్కోర్ చేసి భారత్ పనిపట్టాలనుకుంది. కానీ భారత బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ఆస్ట్రేలియాను తక్కువ సాధారణ స్కోర్కే పరిమితం చేశారు.
బౌలర్లు రాణించినా..
స్వింగ్ కింగ్ రేణుకా సింగ్(2/25), స్నేహ్ రాణా(2/38) రెండేసి వికెట్లు తీయడంతో పాటు దీప్తి శర్మ(1/30), రాధా యాదవ్(1/24) చెరో వికెట్ పడగొట్టడంతో ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 161 పరుగులే చేసింది. భారత్ సూపర్ ఫీల్డింగ్తో ఇద్దరు బ్యాటర్లు రనౌటయ్యారు. ఆసీస్ బ్యాటర్లలో బెత్ మూనీ(61), కెప్టెన్ మెగ్ లాన్నింగ్(36) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
ఓపెనర్ల వైఫల్యం..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్కు ఓపెనర్లు షేఫాలీ వర్మ(11), స్మృతి మంధాన(6) శుభారంభాన్ని ఇవ్వలేకపోయారు. ఇద్దరూ ఆరంభంలోనే వెనుదిరగ్గా..జెమీమా రోడ్రిగ్స్(33), హర్మన్ప్రీత్ కౌర్(65) జట్టును ఆదుకున్నారు. మూడో వికెట్కు 96 పరుగుల భాగస్యామ్యం నెలకొల్పిన అనంతరం జెమీమా వెనుదిరిగింది.ఆ తర్వాత హర్మన్ ప్రీత్ కౌర్ ఒంటరి పోరాటం చేసింది. హాఫ్ సెంచరీ అనంతరం ధాటిగా ఆడే క్రమంలో కీపర్ క్యాచ్గా వెనుదిరిగింది.
దెబ్బతీసిన స్కట్..
అయితే దీప్తి శర్మ, స్నేహ్ రాణా ఔటైనా.. బౌండరీలు బాదడంతో విజయసమీకరణం చివరి రెండు ఓవర్లలో భారత్ విజయానికి 17 పరుగులుగా మారింది.ఈ పరిస్థితుల్లో జట్టు విజయం లాంఛనమేనని అంతా భావించారు. కానీ మేఘన స్కట్ కోలుకోలేని దెబ్బతీసింది. 19వ ఓవర్లో రెండు కీలక వికెట్లు తీసి 6 పరుగులు మాత్రమే ఇచ్చింది. దాంతో చివరి ఓవర్లో 11 పరుగులు అవసరమవ్వగా.. మేఘన సింగ్ రనౌటవ్వగా.. యస్తికా భాటియా ఎల్బీగా వెనుదిరగడంతో భారత్ ఇన్నింగ్స్ 151 పరుగులకే ముగిసింది. మూడు మెగా ఫైనల్లో భారత్ ఒత్తిడిని తట్టుకోలేకనే ఓటమిపాలైంది.