ఎంతో సంయమనంగా
ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ ఎంతో సంయమనంగా ఆడాడు. సిక్సర్లు, బౌండరీల మెరుపుల్లేకుండా క్రీజులో ఎంతో నిగ్రహంగా నిలిచాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది. అనంతరం చేధనలో రోహిత్ శర్మ 122 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు.
ఈ మ్యాచ్లో మాత్రం చాలా నెమ్మదిగా
వన్డే క్రికెట్ అంటే దూకుడుగా ఆడే రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో మాత్రం చాలా నెమ్మదిగా ఆడాడు. రోహిత్ శర్మ గత సెంచరీలను గమనిస్తే 122 పరుగులు చేయడానికి 144 బంతులాడటం అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాదు రోహిత్ సాధించిన అత్యంత నెమ్మదైన సెంచరీ కూడా (128 బంతుల్లో) ఇదే.
లక్ష్య చేధనలో
ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ బ్యాటింగ్ తీరుని గమిస్తే అతడు ఎంత సంయమనంతో ఆడాడో తెలియజేస్తుంది. లక్ష్య చేధనలో దూకుడుగా ఆడే ధావన్ ఆరంభంలోనే ఔట్ కావడం... ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ(18) పరుగులకే పెవిలియన్కు చేరడంతో 228 పరుగుల లక్ష్యం చాలా పెద్దదిగానే కనిపించింది.
కోహ్లీ ఔటైన తర్వాత
కోహ్లీ ఔటైన తర్వాత టీమిండియా గెలుస్తుందా? అన్న సందేహాలను కూడా వ్యక్తం చేశారు. అయితే, రోహిత్ శర్మ క్రీజులో పాతుకుపోయేందుకు గాను చూపించిన పట్టుదల, ఏకాగ్రతపై ప్రశంసలు కురిపిస్తున్నారు. గత వన్డేలను పరిశీలిస్తే రోహిత్ శర్మ క్రీజులో కుదురుకున్నాక భారీ షాట్లు ఆడతాడు. అయితే, బుధవారం నాటి మ్యాచ్లో అలా జరగలేదు.
క్రీజులో నిలదొక్కకునేందుకు
ఎక్కువసేపు క్రీజులో నిలదొక్కకునేందుకు ప్రయత్నించాడు. స్ట్రైక్ రొటేట్ చేస్తూ వీలు చిక్కినప్పడుల్లా బౌండరీలు బాదుతూ క్రీజులో పాతుకుపోవడంపైనే దృష్టిపెట్టాడు. ఈ నేపథ్యంలో 70 బంతుల్లో హాఫ్ సెంచరీని సాధించాడు. సఫారీ స్పిన్నర్లు ఇమ్రాన్ తాహిర్, షమ్సిలు ఒకానొక సమయంలో రోహిత్పై ఒత్తిడిని తీసుకొచ్చారు.
ఇంగ్లాండ్ పరిస్థితులు
అందుకు ఇంగ్లాండ్ పరిస్థితులు కూడా కలిసొచ్చాయి. ఈ మ్యాచ్లో ఇరు జట్ల ఆట కంటే వాతావరణం గురించే ఎక్కువ చెప్పుకోవాలి. మబ్బులు కమ్మి శీతల గాలులతో పిచ్ ఒక్కసారిగా పేసక్లకు అనుకూలంగా మారింది. ముఖ్యంగాఅదనపు బౌన్స్, స్వింగ్కు అనుకూలంగా మారడంతో సఫారీ పేసర్లు రబాడ, క్రిస్ మోరిస్లు చెలరేగారు.
పట్టుదలతో నిలబడిన రోహిత్ శర్మ
అయితే, వాటన్నింటిని దాటుకుంటూ పట్టుదలతో నిలబడిన రోహిత్ శర్మ వరల్డ్కప్లో టీమిండియాకు మంచి ఆరంభాన్నందించాడు. నిజానికి ఫాస్ట్ పిచ్లపై రోహిత్కు గొప్ప రికార్డేమీ లేదు. కానీ, సౌతాంప్టన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో మెరుగైన ప్రదర్శనే చేశాడు. ఈ మ్యాచ్లో రోహిత శర్మ రాహుల్తో కలిసి మూడో వికెట్కు 96 బంతుల్లో 85 పరుగులు జోడించాడు.
ధోనితో కలిసి 74 పరుగులు
అనంతరం ధోనితో కలిసి 74 పరుగులు జత చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 48 బంతుల్లో 49 పరుగులు చేయాల్సిన దశలో వీరిద్దరూ దూకుడుగా ఆడి లక్ష్యాన్ని తగ్గించారు. తొలుత 70 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన రోహిత్, మిగతా యాభై పరుగులను 58 బంతుల్లోనే అందుకుని సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
|
రోహిత్ శర్మ బెస్ట్ ఇన్నింగ్స్ల్లో ఇదొకటి
మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ ప్రదర్శనపై కోహ్లీ మాట్లాడుతూ "వన్డేల్లో రోహిత్ శర్మ బెస్ట్ ఇన్నింగ్స్ ఇదొకటి. ఈ మ్యాచ్లో రోహిత్ ఇన్నింగ్స్ ఎంత ప్రత్యేకమో అర్థమవుతుంది. నిలదొక్కుకోడానికి అనుభవజ్ఞులైన బ్యాట్స్మెన్ కావాలి. టాపార్డర్లో ఒకరు సెంచరీ సాధించడం మిగతవారికి కలిసివస్తోంది. రాహుల్, ధోనీ చాలా బాగా ఆడారు. చివర్లో హార్దిక్ మంచి ఫినిషింగ్ ఇచ్చాడు" అని అన్నాడు.