ఆదిలోనే షాక్:
337 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (7) విజయ్ శంకర్ బౌలింగ్లో ఎల్బీగా ఔట్ అయ్యాడు. 5వ ఓవర్లో 4 బంతులు వేసిన భువనేశ్వర్ గాయం కారణంగా వెనుదిరగగా.. మిగిలిన 2 బంతులను వేసేందుకు వచ్చిన శంకర్ తన తొలి బంతికే వికెట్ తీసాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన బాబర్ ఆజంతో కలిసి ఫకర్ జమాన్ జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ను గాడిలో పెట్టాడు. ఇద్దరూ అడపాదడపా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపారు. వీరు రెండో వికెట్కు 100 పరుగులు జోడించారు.
కుల్దీప్, పాండ్యా మాయ:
నిలకడగా ఆడుతున్న బాబర్ ఆజం (48; 57 బంతుల్లో 3×4, 1×6) కుల్దీప్ వేసిన 23.6వ బంతికి క్లీన్బౌల్డ్ అయ్యాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన హఫీజ్ సిక్స్ బాది ప్రమాదకరంగా కనిపించాడు. కుల్దీప్ వేసిన 26.2వ బంతికి ఫకర్ జమాన్ (62; 75 బంతుల్లో 7×4, 1×6) క్యాచ్ ఔట్ అయ్యాడు. ఇక పాండ్యా వేసిన 27.5వ బంతికి మొహమ్మద్ హఫీజ్ (7) శంకర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాతి బంతికి షోయబ్ మాలిక్ (0) డకౌట్ అయ్యాడు. దీంతో పాక్ కీలక ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
5 ఓవర్లలో 136 పరుగులు:
ఈ తరుణంలో పాక్ ఆదుకుంటాడనుకున్న కెప్టెన్ సర్ఫరాజ్(12)ను శంకర్ బోల్తా కొట్టించాడు. అయితే 35 ఓవర్ల వద్ద మ్యాచ్కు వరుణుడు అంతరాయం కలిగించడంతో కాసేపు ఆట నిలిచిపోయింది. ఆట ఆగే సమయానికి పాక్ స్కోరు 166/6. వర్షం తగ్గాక మ్యాచ్ను 40 ఓవర్లకు కుదించి పాక్ లక్ష్యాన్ని 302 పరుగులుగా నిర్ణయించారు. అంటే విజయానికి 5 ఓవర్లలో 136 పరుగులు చేయాలి. చివరకు పాక్ నిర్ణీత 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసి ఓటమిపాలైంది. భారత బౌలర్లలో కుల్దీప్, విజయ్, హార్దిక్లు తలో రెండు వికెట్లు తీశారు
రోహిత్ సెంచరీ:
అంతకుముందు భారత ఇన్నింగ్స్కు ఓపెనర్లు బలమైన పునాది వేశారు. రోహిత్ శర్మ (140; 113 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ సెంచరీ చేయగా.. కేఎల్ రాహుల్ (57; 78 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ (77; 65 బంతుల్లో 7 ఫోర్లు) హాఫ్ సెంచరీ.. పాండ్యా (19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) కొన్ని భారీ షాట్లతో మెరవడంతో భారత్ 336 పరుగులు చేసింది. పాకిస్తాన్ బౌలర్లలో మహ్మద్ అమిర్ మూడు వికెట్లు సాధించగా.. హసన్ అలీ, వహాబ్ రియాజ్లు చెరో వికెట్ తీశారు.