ముంబై: యూఏఈ వేదికగా మెగా టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 ఈరోజు ప్రారంభం కానుంది. సీజన్ తొలి మ్యాచ్లో రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్, డిపెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. అబుదాబిలోని షేక్ జయేద్ స్టేడియం ఈ రోజు మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తోంది. ఈ సందర్భంగా టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. తన జట్టుకు ఆల్ ది బెస్ట్ విషెస్ చెప్పాడు. ఆరంభ మ్యాచ్లో చెన్నై విజయం సాధించాలని కోరుకున్నాడు.
ఇండియా టుడే నిర్వహించిన ఓ ఇంటర్య్వూలో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ.. ఈసారి ఐపీఎల్లో తనతో పాటు సురేశ్ రైనా లేకున్నా చెన్నైకి ఎలాంటి నష్టం లేదన్నాడు. 'నిజం చెప్పాలంటే నేను ఐపీఎల్ లీగ్ను మిస్సవుతాను. అరంగేట్రం నుంచి ఇందులో భాగమవుతున్నాను. లీగ్లో నాది అద్భుత ప్రయాణం. ఎంతో ఆస్వాదించాను. అయితే ఈ ఏడాది పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అందుకే కుటుంబంతో కలిసుండేందుకే ప్రాధాన్యం ఇచ్చాను. లీగ్ నుంచి తప్పుకోవడానికి కారణాలేంటనది ఇదివరకే చెప్పా' అని భజ్జీ పేర్కొన్నాడు.
'నాతో పాటు సురేశ్ రైనా కూడా చెన్నై జట్టుకు దూరమవ్వడం కొంచెం వెలితిగా అనిపించింది. మేమిద్దరం ఆడకపోయినా.. సీఎస్కేకు వచ్చిన నష్టం ఏంలేదు. ఎందుకంటే.. షేన్ వాట్సన్, ఎంఎస్ ధోనీ, డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజాకు ఎంతో అనుభవం ఉంది. టోర్నీ మొత్తం చెన్నై మంచి ప్రదర్శన కనబరుస్తుందని ఆశిస్తున్నా. ఇక ఐపీఎల్ టైటిల్ ఎవరు గెలుస్తారనడం చెప్పడం కష్టమే. చెన్నై జట్టు సభ్యుడిగా కచ్చితంగా మా జట్టే టైటిల్ గెలవాలని కోరుకుంటా. కానీ ఐపీఎల్లో ఎవరి స్ట్రాటజీలు వారికి ఉంటాయి. లీగ్లో ఎవరైనా గెలవొచ్చు' అని హర్భజన్ తెలిపాడు.
'సురేశ్ రైనా లాంటి సీనియర్ ఆటగాడి సేవలను చెన్నై కోల్పోవడం కొంచెం బాధాకరమే. అయినా.. ఆ లోటు తెలియకుండా మిగతావారు రాణిస్తారనే నమ్మకం ఉంది. జట్టు సభ్యులు నన్ను ఎంత మిస్సవుతున్నారో తెలియదు గానీ.. నేను మాత్రం అందరిని చాలా మిస్సవుతున్నా. ఆల్ ది బెస్ట్.. చెన్నై సూపర్ కింగ్స్. సీఎస్కే అత్యుత్తమంగా ఆడాలని కోరుకుంటున్నా' అని హర్భజన్ చెప్పుకొచ్చాడు. కరోనా వైరస్ చెన్నై శిబిరంలో కలకలం సృష్టించింది. ఆ జట్టు ఆటగాళ్లు దీపక్ చహర్, రుత్రాజ్ గైక్వాడ్ వైరస్ బారిన పడ్డారు. దాంతో వారికి మ్యాచ్ ప్రాక్టీస్ తగినంతగా లభించలేదు.
IPL 2020 టైటిల్ ఆ జట్టే గెలుస్తుంది.. ఎందుకంటే?: బ్రెట్ లీ