ముంబై: ఏప్రిల్ 9న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 ప్రారంభం కానుంది. ఐపీఎల్ ఆరంభానికి మరో వారం రోజులే ఉండడంతో అన్ని జట్లు ముమ్మర సాధన చేస్తున్నాయి. అందరికంటే ముందే ప్రాక్టీస్ ఆరంభించిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) భారీ షాక్ తగిలింది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్వుడ్ ఐపీఎల్ 2021 నుంచి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో ఈ ఏడాది ఐపీఎల్లో ఆడటం లేదని హేజిల్వుడ్ స్పష్టం చేశాడు. దీంతో సీఎస్కే కొత్త బౌలర్ కోసం వెతుకుతోంది.
IPL 2021: 'నా వయసు 20 ఏళ్లు కాదు 40 ఏళ్లు.. విజయవంతం కావాలంటే ఏం చేయాలో తెలుసు'
'ఈ ఏడాది కీలకమైన టీ20 ప్రపంచకప్, యాషెస్ సిరీస్ ఉన్నాయి. దాంతో దాదాపు 10-12 నెలలు బయో-బబుల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకే నా కుటుంబంతో సమయం గడపాలని ఆశిస్తున్నా. టీ20 ప్రపంచకప్, యాషెస్ సిరీస్ కోసం మానసికంగా, శారీరకంగా నాకు నేను సిద్ధమవ్వాలి. అందుకే ఐపీఎల్ 2021 సీజన్కి దూరమవుతున్నా. చెన్నై సూపర్ కింగ్స్ బాగా ఆడుతుందని ఆశిస్తున్నా. కప్ గెలవాలని కోరుకుంటున్నా' అని జోష్ హేజిల్వుడ్ అన్నాడు.
ఐపీఎల్ 2020 సీజన్లో జోష్ హేజిల్వుడ్ని రూ.2 కోట్లకి చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేయగా.. ఐపీఎల్ 2021 సీజన్కి కూడా అదే ధరకి రిటైన్ చేసుకుంది. గత సంవత్సరం ఏ ఒక్క ఫాస్ట్ బౌలర్ కూడా రాణించలేదు. సామ్ కరన్ పర్వాలేదనిపించగా.. లుంగీ ఎంగిడి, దీపక్ చహర్ పూర్తిగా విఫలమయ్యారు. ఇప్పుడు హేజిల్వుడ్ దూరమవడం చెన్నైకి భారీ ఎదురుదెబ్బే అనే చెప్పాలి. చెన్నై ఎవరిని తీసుకుంటుందో చూడాలి.
ఆస్ట్రేలియా ఈ ఏడాది వెస్టిండీస్, బంగ్లాదేశ్తో సిరీస్ ఆడనుంది. అక్టోబరు-నవంబరులో టీ20 ప్రపంచకప్, ఆ తర్వాత యాషెస్ సిరీస్ ఉన్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టు దాదాపు 10-12 నెలల పాటు బయో-బబుల్లో ఉండే అవకాశం ఉంది. దాంతో ఆస్ట్రేలియా క్రికెటర్లు ఒక్కొక్కరు ఐపీఎల్ 2021 సీజన్ నుంచి తప్పుకుంటున్నారు. ఇప్పటికే మిచెల్ మార్ష్ (సన్రైజర్స్ హైదరాబాద్), జోష్ ఫిలిప్పీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) టోర్నీ నుంచి తప్పుకోగా.. జోష్ హేజిల్వుడ్ కూడా వారినే అనుసరించాడు.
ఐపీఎల్ 2021 మ్యాచులకు ముంబై, కోల్కతా, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ మ్యాచ్లకి ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. ఈసారి ఏ జట్టుకూ సొంతగడ్డపై ఆడే అవకాశం లేదు. సీఎస్కే లీగ్ దశలో 14 మ్యాచ్లు ఆడనుండగా.. అందులో 5 మ్యాచ్లు ముంబై వేదికగా, 4 మ్యాచ్లు ఢిల్లీ వేదికగా, 3 మ్యాచ్లు బెంగళూరు వేదికగా, 2 మ్యాచ్లు కోల్కత వేదికగా ఆడనుంది. ఐపీఎల్ 2020 సీజన్కు గాను సీఎస్కే ప్రదర్శన చూసుకుంటే.. మొత్తం 14 మ్యాచ్ల్లో 6 విజయాలు, 8 ఓటములను ఎదుర్కొంది.