
హైదరాబాద్: ఐపీఎల్లో ఆడబోయే ప్లేయర్లను జనవరి 4 నుంచి ఫ్రాంచైజీలు ప్రకటిస్తూనే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ధోనీ, సురేశ్ రైనాను అట్టి పెట్టుకుని మిగిలిన వారిని వేలానికి వదిలేశాయి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రెండేళ్ల విరామం తర్వాత ఐపీఎల్లోకి మళ్లీ ఆడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ధోనీ అశ్విన్ను జట్టులోకి తప్పక తీసుకుంటామని పేర్కొన్నాడు.
కానీ, వేలంలో దానికి విరుద్ధంగా జరిగింది. రవిచంద్రన్ అశ్విన్ను వేలంలో ఆర్టీఎమ్(రైట్ టు మ్యాచ్) ద్వారా దక్కించుకుంటామని మాట తప్పింది. వేలంలో స్పిన్ మాంత్రికుడు అశ్విన్ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ.7.6కోట్లకు ఎగరేసుకుపోయింది. మరి, తామే దక్కించుకుంటామన్న చెన్నై.. అశ్విన్ను ఎందుకు వదిలేసింది. ఈ ప్రశ్నపై తాజాగా ఆ జట్టు కోచ్ స్టీపెన్ ఫ్లెమింగ్ స్పందించాడు.
'వేలంలో అశ్విన్ను దక్కించుకోవాలనుకోవడం నిజం. అతని కోసం రూ.4కోట్ల వరకు ఖర్చు చేయాలని వేలానికి ముందే ప్రణాళిక కూడా వేసుకున్నాం. కానీ, సీనియర్ ఆటగాడైన అశ్విన్ కోసం చాలా ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపాయి. దీంతో అతని ధర ఒకానొక సమయంలో రూ.7కోట్లకు పైగా చేరింది. మేము అనుకున్న దాని కంటే పెరుగుతూ వచ్చింది'.
ఆ సమయంలో జట్టులో ఇంకా భర్తీ చేయాలంటే ఎంతో మంది ఆటగాళ్లను కొనాల్సి ఉంది. మా దగ్గర ఉన్న మొత్తం తక్కువ. అశ్విన్ ధర మాత్రం పెరుగుతూనే ఉంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ.7.6కోట్ల వద్ద ఆగింది. ఈ సమయంలో సహచరులమంతా చర్చించుకుని అశ్విన్ను వదిలేద్దాం అని నిర్ణయించుకున్నాం.
జట్టులో సీనియర్ స్పిన్నర్ ఎంతో అవసరం. అందుకే రూ.2కోట్లు పెట్టి హర్భజన్ సింగ్ను కొనుగోలు చేశాం' అని ఫ్లెమింగ్ వివరించాడు. ఇక హర్భజన్ విషయానికొస్తే ఆర్టీఎమ్ అవకాశం ఉన్నా ముంబయి ఇండియన్స్ అతడ్ని వదిలేసుకుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.