చెపాక్లో ధోనిసేన ప్రాక్టీస్ మ్యాచ్: ఎంత మంది వచ్చారో తెలుసా?

హైదరాబాద్: శనివారం ముంబైలో జరిగే తొలి మ్యాచ్తో ఐపీఎల్ 11వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ సీజన్ ఎన్నో అంచనాలు సృష్టిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే రెండేళ్ల విరామం తర్వాత రాజస్థాన్ రాయల్స్తో పాటు ఎక్కువ మంది అభిమానులను కలిగిన చెన్నై సూపర్ కింగ్స్ లీగ్లోకి పునరాగమనం చేయడమే.
ఈ సీజన్లో కూడా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలోనే చెన్నై సూపర్ కింగ్స్ బరిలోకి దిగుతోంది. ఇప్పటికే, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రెండు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. మరో నాలుగు రోజుల్లో లీగ్ ఆరంభంకానున్న నేపథ్యంలో జట్టు ఆటగాళ్లు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో వార్మప్ మ్యాచ్ల్లో పాల్గొంటున్నారు.

వేలంలో బిల్లింగ్స్ను రూ. కోటికి కొనుగోలు చేసిన చెన్నై
ఈ ఏడాది జనవరిలో జరిగిన ఐపీఎల్ వేలంలో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ శామ్ బిల్లింగ్స్ను చెన్నై ప్రాంఛైజీ రూ. 1 కోటికి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. సోమవారం చెపాక్ స్టేడియంలో జరిగిన ఓ ప్రాక్టీస్ మ్యాచ్ గురించి శామ్ బిల్లింగ్స్ సోషల్ మీడియాలో తన ఫొటోను పోస్ట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ప్రాక్టీస్ మ్యాచ్కు 10వేల మంది
'ప్రాక్టీస్ సెషన్ మ్యాచ్కు 10వేలకు పైగా అభిమానులను స్టేడియంలో చూసి ఆశ్చర్యపోయా. కేవలం తమ జట్టులోని ఆటగాళ్లతో సాధారణ ప్రాక్టీస్ మ్యాచ్. 10వేల మంది ప్రజలు రావడం అద్భుతం' అని శామ్ బిల్లింగ్స్ తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో పేర్కొన్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వీడియో
మ్యాచ్ అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో శామ్ బిల్లింగ్స్ వీడియోని పోస్టు చేసింది. ఆ వీడియోలో శామ్ బిల్లింగ్స్ ప్రాక్టీస్ మ్యాచ్కు ఇంతమంది అభిమానులు రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. 'వనక్కమ్ చెన్నై. ఇక్కడ ఉండటం సంతోషంగా ఉంది. ఈరోజు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ ఆడాం. అభిమానుల సపోర్ట్ చూసి ఆశ్చర్యపోయాం. ప్రాక్టీస్ మ్యాచ్కు 10,000 మంది. ఇంతమంది అభిమానుల మద్దతు నిజంగా అద్భుతం. నిజంగా ఐపీఎల్లో ఆడేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా. ఇదొక అద్భుతమైన ఫ్రాంఛైజీ' అని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు.

24 బంతుల్లో 7 సిక్సుల సాయంతో రైనా హాఫ్ సెంచరీ
ఇదిలా ఉంటే ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో సురేశ్ రైనా 24 బంతుల్లో 7 సిక్సుల సాయంతో హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. చెపాక్ స్టేడియంలో హుస్ ఎలెవన్ (మైక్ హస్సీ), ఫ్లెమ్ ఎలెవన్ (స్టీఫెన్ ప్లెమింగ్) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. 20 ఓవర్ల ప్రాక్టీస్ మ్యాచ్లో హుస్ ఎలెవన్ జట్టు తరుపున ఆడిన సురేశ్ రైనా 57 పరుగులు చేశాడు. ఒత్తిడిని ఎలా అధిగమించాలనే దానిపై ఈ ప్రాక్టీస్ మ్యాచ్ని నిర్వహించారు. కాగా, ఏప్రిల్ 7న ఐపీఎల్ 11వ సీజన్ ప్రారంభం కానుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తలపడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications