ముంబైలోకి రషీద్, లివింగ్ స్టోన్..
వీదేశీ కోటాలో అఫ్గానిస్థాన్ సెన్సేషన్, స్పిన్ ఆల్రౌండర్ రషీద్ ఖాన్, ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ సామ్ కరన్, ఇంగ్లండ్ హిట్టర్ లియామ్ లివింగ్ స్టోన్లను తీసుకుంది. ఈ వివరాలను ముంబై ఇండియన్స్ ట్విటర్ వేదికగా ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ సందర్భంగా రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ.. కొత్త ఆటగాళ్లను తమ కుటుంబంలోకి ఆహ్వానించడం సంతోషంగా ఉందని చెప్పాడు.
క్రికెట్ అభిమానులను అలరిస్తాయి..
'ఎంఐ కేప్టౌన్ నిర్మాణ ప్రయాణంలో ముందడుగు పడినందుకు సంతోషంగా ఉంది. రషీద్, కగిసో రబడా, లియామ్, సామ్లను మా #OneFamily లోకి ఆహ్వానించడం ఆనందంగా ఉంది. డెవాల్డ్ బ్రెవిస్ మాతో తన కొత్త ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. దూకుడైన ఆటకు ఎంఐ పర్యాయపదం లాంటిది. ఎంఐ కేప్టౌన్.. అలాగే మా ఇతర జట్లు కూడా ఇలాగే ముందుకు సాగుతూ దక్షిణాఫ్రికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు అందరినీ అలరిస్తాయి.' అని తెలిపారు.
ఆగస్టు 10 డెడ్లైన్..
వచ్చే ఏడాది ప్రారంభంలో క్రికెట్ సౌతాఫ్రికా ఆధ్వర్యంలో ఈ టీ20 లీగ్ జరగనుంది. ఈ లీగ్ నిబంధనల ప్రకారం ఫ్రాంచైజీలు గరిష్టంగా ఐదుగురు ఆటగాళ్లను నేరుగా తీసుకోవచ్చు. ఇందులో ఒకరు ఖచ్చితంగా సౌతాఫ్రికా ప్లేయర్ అయి ఉండాలి. ముగ్గురు విదేశీ ప్లేయర్లను తీసుకోవచ్చు. ఒక అన్ క్యాపడ్ ప్లేయర్ ఉండాలి. ఈ ఆటగాళ్ల ఎంపికకు ఆగస్ట్ 10 డెడ్లైన్ కాగా.. ఎంఐ కెప్టౌన్ మాత్రమే తమ ఆటగాళ్ల పేర్లను ప్రకటించింది.
ఐపీఎల్ ఫ్రాంచైజీలే..
కాగా, సఫారీ లీగ్లో పాల్గొనే మొత్తం ఆరు జట్లను ఐపీఎల్ ఫ్రాంచైజీలే సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కేప్టౌన్ను ముంబై ఇండియన్స్, జొహన్నెస్బర్గ్ను సీఎస్కే, సెంచూరియన్, పార్ల్, డర్బన్, పోర్ట్ ఎలిజబెత్ ఫ్రాంచైజీలను ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్, సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యాలు దక్కించుకున్నాయి. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ తమ ఫ్రాంచైజీ పేరును జోహన్నెస్బర్గ్ సూపర్ కింగ్స్గా నామకరణం చేసింది. ఫాఫ్ డుప్లెసిస్ను కెప్టెన్గా ఎంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.